హనుమకొండ, ఆగస్టు 21 : పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒకే ఆన్లైన్ యాప్ విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్యూనియన్ సిఐటియు హనుమకొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్కాలేజీ ఆడిటోరియం నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు అంగన్వాడీలు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి మాట్లాడుతూ విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అంగన్వాడీలకు అదనంగా చెల్లించాలన్నారు. 6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్నడపడానికి అనుమతి ఇవ్వరాదని, అదనపు పనులు రద్దు చేయాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 6 సంవత్సరాల లోపు పిల్లలకందించే ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదన్నారు.
ప్రీ ప్రైమరీ, పిఎం శ్రీ విద్యపై రాష్ర్ట ప్రభుత్వం చేసిన నిర్ణయం సరైందిగా లేదని, ఇది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోగా ప్రభుత్వంలో భాగమైన అతి ముఖ్యమైన 6 సంవత్సరాల లోపు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్న ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు. ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు నిడిగొండ రజిత, పి.రమాదేవి, శోభారాణి,కే.జమున, జోష్ణ, ప్రసన్న, రమాదేవి, రాజేశ్వరి హైమావతి, శోభారాణి, వసంత, కిరీట, సీహెచ్ స్వరూపారాణి,ఎస్ ఉమాదేవి, బేబీ రాణి, శోభ, తదితరులు పాల్గొన్నారు.