మునిపల్లి, ఆగస్టు 5 : ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 143 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా తరగతి గదులు ఉన్నాయి. అయితే తరగతి గదులు 60 ఏండ్ల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఉపాధ్యాయులు సైతం భయపడుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది. తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. గట్టిగా వర్షం వస్తే పాఠశాల కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. తడిసిన గోడల మధ్య తరగతులు నిర్వహించడం సంబంధిత అధికారుల నిర్లక్ష్యమని స్థానికులు వాపోతున్నారు.

వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పాఠశాల తరగతి గదులు పూర్తిగా తడిసి ప్రమాదకరంగా మారాయి. ఉన్నతాధికారులు నిత్యం మం డల కేంద్రానికి వచ్చి వెళ్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంగారెడ్డి కలెక్టర్ స్పందించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పై అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం. విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం. పాఠశాల పూ ర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులను మరోచోటకు తరలించి తరగతులు నిర్వహించేందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
-భీమ్సింగ్,ఎంఈవో మునిపల్లి మండలం(మెదక్ జిల్లా)