పరకాల, ఫిబ్రవరి 25: ‘జాతరలో జై తెలంగాణ అని నినాదాలు చేయడమే తప్పా..? అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి లాక్కెళ్లి కొడ్తారా? బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోకుంటే ఈనెల 28న ఆత్మకూరులో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం’ అని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి రాత్రికి రాత్రే అరెస్టులు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ నెల 28న ఆత్మకూరులో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులతో కలిసి అగ్రంపహాడ్లో సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి వెళ్లగా నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ అని నినాదాలు చేశారని పేర్కొన్నారు. ఇలా నినాదాలు చేసినందుకే పోలీసులు వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లకు తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రం గా గాయపరిచారని, ఈ ఘటనపై తాము వరంగల్ సీపీకి ఫిర్యాదు చేయగా శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారని చెప్పారు. రెండురోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారని తెలిపారు. రేపటితో రెండు రోజుల గడువు పూర్తవుతుందని, సీపీపై నమ్మకంతో రేపటి వరకువేచి చూస్తామని, లేదంటే ఈ నెల 28న ఆత్మకూరు మండలకేంద్రంలో ధర్నా చేస్తామని చల్లా హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు ధర్నాలో పాల్గొంటారని, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, సంగెం జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, దామెర వైస్ ఎంపీపీ జాకిర్ అలీ, బీఆర్ఎస్ నాయకులు గోల్కొండ శ్రీనివాస్, కన్నెబోయిన రమేశ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు : ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి రాత్రివేళ అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయని తమ భర్తలను అకారణంగా చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రంపహాడ్ జాతరలో శుక్రవారం రోజున బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ అనడమే తప్పయిందని, ఈ కారణంతోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. కేసుల్లో బలం లేకున్నా, మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్లను తీసుకుపోయినట్లు, ఉగ్రవాదులను తీసుకుపోయినట్లు పోలీసులు అర్ధరాత్రి తమ ఇండ్లలో చొరబడి తమవాళ్లను లాక్కెళ్లారని చెప్పారు. అసలు వాళ్లు చేసిన నేరమేమిటో పోలీసులు చెప్పాలని, చీకటి రాజకీయాలు కాదని, మీడియా ముందు చెప్పాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
బాధితుల నుంచి వాంగ్మూలం సేకరణ
సుబేదారి, ఫిబ్రవరి 26 : బీఆర్ఎస్ నాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింన పోలీసు అధికారులపై డీసీపీ అబ్దుల్ బారి విచారణ చేపట్టారు. ఈ నెల 23న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అగ్రంపహాడ్ జాతరకు వెళ్లిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ, జై చల్లా నినాదాలు చేయడంతో వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పరకాల ఏసీపీ, ఆత్మకూరు సీఐ సమక్షంలో ఎస్సై ప్రసాద్ సుబేదారిలోని కమిషనరేట్ టాస్క్ఫోర్స్ కార్యాలయంలో 12మందిని విపరీతంగా కొట్టారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేలు, బాధితులతో కలిసి సీపీని కలిశారు. ఏసీపీ, సీఐ, ఎస్సై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీ ఆదేశాల మేరకు డీసీపీ బారి ఆదివారం రాత్రి బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.