వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన ఓరుగల్లును అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చొరవతో మూడేళ్లలో రూ.3,348 కోట్లతో వివిధ పనులను ప్రారంభించారు. రూ.110 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రూ.27 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ.270 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. శ్మశాన వాటికలను మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం సొంత భవనాలను నిర్మించింది. ఇటీవలే ఆజంజాహీ మిల్స్ స్థలంలో కలెక్టరేట్ నిర్మాణానికి లైన్క్లియర్ అయింది. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణ పనులు పూర్తయ్యాయి. పేద మైనార్టీల విద్యాభివృద్ధే లక్ష్యంగా ఏడు మైనార్టీ గురుకుల పాఠశాలలు, రెండు కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు, కళ్ల ముందు అభివృద్ధి ఫలాలు కనబడుతుండడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. – ఖిలావరంగల్, మార్చి 18
స్వరాష్ట్రంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు పడ్డాయి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. గత పాలకులు ఆరు దశాబ్దాల పాటు అభివృద్ధిని విస్మరించారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లో ముందుండే విధంగా చర్యలు తీసుకొన్నారు. దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. గడిచిన మూడేళ్లలో రూ.3,348 కోట్లతో వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలు కళ్ల ముందు కనబడుతుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. – ఖిలావరంగల్, మార్చి 18
రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖాన నిర్మాణ పనులు వరంగల్ తూర్పులో జరుగుతున్నాయి. రూ.1,100 కోట్లతో 24 అంతస్తుల సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. దవాఖానలో 40 రకాల వైద్య సేవలు నిరంతరం అందిలా ప్రణాళికలు రూపొందించారు. ఎంజీఎం దవాఖాన పడకల సామర్థ్యాన్ని వెయ్యి నుంచి 1300లకు పెంచారు. ప్రతి రోజూ సగటున 1400 మంది ఓపీలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. రూ. కోటితో నూతనంగా సీటీ స్కాన్తో పాటు 25 పడకలతో పిల్లల కోసం పీఐసీయూ వార్డును అందుబాటులోకి తీసుకువచ్చారు. రోజుకు సుమారు 40 మందికి డయాలసిస్ చేస్తున్నారు. హిజ్రాల కోసం ప్రతి మంగళవారం ఓపీ, మహిళల కోసం ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఓపీ చూస్తున్నారు. సీకేఎం ప్రసూతి దవాఖానలో కొత్తగా రక్త నిధి నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రంగశాయిపేట, వరంగల్ కీర్తినగర్లో మహిళలకు ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. దీనికి తోడు స్లమ్ ఏరియాల్లో బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
వరంగల్ తూర్పు రోడ్లకు మహర్దశ పట్టింది. ఎటు చూసినా స్మార్ట్ రోడ్లతో కళకళలాడుతున్నది. నిజాం కాలం నాటి గతుకుల రోడ్ల స్థానంలో రూ.163.69 కోట్లతో నూతన రహదారులకు ప్రణాళికలు రూపొందించారు. రూ.110 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయి. ఎంజీఎం నుంచి పోచమ్మమైదాన్ మీదుగా వెంకట్రామ జంక్షన్ వరకు, పోచమ్మ మైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా మీదుగా రైల్వేస్టేషన్ వరకు, చౌరస్తా నుంచి హంటర్ రోడ్డును కలుపుతూ చేపట్టిన ప్రధాన రహదారుల పనులు పూర్తయ్యాయి.
భారీ వాహనాలు నగరంలోకి రాకుండా ఏర్పాటు చేయనున్న ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. రంగశాయిపేట నుంచి ఖిలావరంగల్ మీదుగా ఎనుమాముల మార్కెట్ వరకు రోడ్డు నిర్మాణం కోసం ఇప్పటికే భూములను ప్రభుత్వం కొనుగోలు చేసింది. త్వరలోనే రోడ్డు వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
మైనార్టీల విద్య కోసం తెలంగాణ సర్కారు అహర్నిశలు కృషి చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గురుకులాలు కేవలం పది మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే ఏడు మైనార్టీ గురుకుల పాఠశాలలు, రెండు కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. అలాగే ఓ సిటీలో స్టేడియం నిర్మించారు. ఎల్బీ నగర్, చింతల్ ప్రాంతాల్లో షాదీఖాన నిర్మాణం కోసం రూ. కోటికిపైగా నిధులు మంజూరు చేశారు. ఉర్సు ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ.16 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అలాగే చిన్నవడ్డేపల్లి చెరువు బండ్ కోసం రూ.6కోట్లు కేటాయించారు. జిల్లా కేంద్రంలో సమీకృత భవనాలకు అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలోనే కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అనతి కాలంలోనే రూ.3,348 కోట్ల నిధులతో తూర్పు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మాడ్రన్ సిటీగా రూపాంతరం చెందుతోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అంతిమ సంస్కారాలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు చేపట్టిన అభివృద్ధి పనులతో శ్మశాన వాటికలు పార్కులను తలపిస్తున్నాయి. అంతర్గత రోడ్లతో పాటు మోడల్ వైకుంఠధామాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.256 కోట్లు కేటాయించింది. ఎల్బీనగర్లో హిందూ ముక్తీ స్థల్ కోసం రూ.3 కోట్లు మంజూరు చేసింది. అద్దె ఇండ్లల్లో ఉన్నవారు మరణిస్తే యజమానులు అంతిమ అంతిమ సంస్కారాల ప్రక్రియకు అడ్డు తగులుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శివనగర్, ఖిలావరంగల్, కాశీబుగ్గ, దేశాయిపేట ప్రాంతాల శ్మశాన వాటికల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసింది.
తూర్పు నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.110 కోట్లతో దూపకుంటలో 2వేల ఇండ్లు, జర్నలిస్టుల కోసం దేశాయిపేటలో 200 ఇండ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే లబ్ధిదారులకు అందజేసేందుకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఏర్పాట్లు చేస్తున్నారు. వేగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు..
వరంగల్ లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు జోరందుకున్నాయి. రూ.27 కోట్లతో వెజ్, నాన్వెజ్, పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు అనువుగా మార్కెట్ను నిర్మిస్తున్నారు. అలాగే, 2019లో ఇక్కడ రూ.6.20 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మించారు. వంద మంది హోల్సేల్ వ్యాపారులతో 400 మంది రిటైల్దారులు నిత్యం ఉపాధి పొందుతున్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తెలంగాణలో ఆత్మగౌరవ భవనాలను నిర్మించేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. విలువైన భూములను కేటాయిస్తూ కోట్లల్లో నిధులు విడుదల చేశారు. నియోజక వర్గంలోని ప్రతి డివిజన్లో 5 నుంచి 11 వరకు కమ్యూనిటీ భవనాలు నిర్మించారు. ఒక్క 38వ డివిజన్లోనే రూ.3.12 కోట్లు ఖర్చు చేసి 11 కమ్యూనిటీ భవనాలను నిర్మించగా, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ వినియోగదారులకు సేవలందించే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇప్పుడు సొంత భవనాల్లోకి మారాయి. వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం రెండు భవనాలను నిర్మించింది. ప్రస్తుతం ఉర్సుగుట్ట సమీపంలో ఖిలావరంగల్, కొత్తవాడలో వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.
ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. గతేడాది మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాలను సందర్శించి ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రూ.239 కోట్లతో 1300 మీటర్ల పొడవైన అండర్ గ్రౌండ్ డక్ట్( భూగర్భ వరద నీటి కాల్వ) నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఖిలావరంగల్ అగడ్త వరద నీరు శివనగర్లోకి రాకుండా సుమారు 750 మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. వరద నీరు హంటర్ రోడ్డులోని 12 మోరీల వరకు చేరేలా డ్రైనేజీ నిర్మిస్తున్నారు.