భీమదేవరపల్లి, జనవరి 3 : సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన వేముల శ్రీనివాసులును నియమిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులు నియామకం కావడంపై గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసులు తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తప్పని పరిస్థితుల్లో అమ్మమ్మ ఊరైన ముల్కనూరుకు వచ్చి తల్లి అనసూయతో స్థిరపడ్డాడు. కిరాణా దుకాణం నడిపిస్తూ పిల్లలను చదివించి ప్రయోజకులను చేసిందామె. అత్యంత పేదరికాన్ని ఎదుర్కొన్న ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించింది.
ఇందులో చిన్నవాడైన శ్రీనివాసులు పదో తరగతి వరకు ముల్కనూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత వరంగల్, హైదరాబాద్లో ఉన్నత విద్య పూర్తిచేసి మొదట స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో మంచి ఉద్యోగం సాధించాడు. ఇలా అంచెలంచలుగా ఎదిగి క్రమశిక్షణతో ప్రస్తుతం ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగ నిబద్ధతను గుర్తించిన ప్రభుత్వం సీఎం ఓఎస్డీగా నియమించింది. దీంతో గ్రామంలో శ్రీనివాసులుతో చదువుకున్న మిత్రులు, బంధువులు, గ్రామస్తులు సంబురపడుతున్నారు. గతంలోనే ఇతర మిత్రుల సహకారంతో ప్రజాగ్రంథాలయాన్ని స్థాపించి మంచి పేరును తెచ్చుకున్న శ్రీనివాసులు.. ఓఎస్డీగా మరింత పేరు తెచ్చుకోవాలని పలువురు ఆకాంక్షించారు.