కాజీపేట, అక్టోబర్ 19 : నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ అని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేటలోని మెయిన్ రోడ్డులో గురువారం ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. సందర్భంగా చీఫ్విప్ ప్రతి దుకాణానికి వెళ్లి అందరినీ పలుకరించారు. కలిసిన ప్రతి ఒక్కరిని ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్తక, వాణిజ్య సంఘాలు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దుతునిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా ఆలోచించి, ఆచితూచి మ్యానిఫెస్టోని తయారు చేశారన్నారు. నమ్మకానికి మారుపేరు కేసీఆర్ అని, నయ వంచనకుమారు పేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోతో ప్రజల హృదయాలు ఆనందంతో పొంగుపోతుంటే ప్రతి పక్షాల గుండెలు జారిపోయి, వారి ఫ్యూజులు ఖతమయ్యాయని అన్నారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, సౌభాగ్యలక్ష్మి వంటి పథకాలను మహిళల కోసం తీసుకొచ్చారన్నారు. గ్యాస్ సిలిండర్తో బీజేపీ సెగ పెట్టిందని, అయితే, సీఎం కేసీఆర్ మాత్రం సిలిండర్ను రూ.400కే పేదలకు అందించే నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆసరా పింఛన్లను రూ.5 వేలకు పెంచడం, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచడం, రైతు బంధును రూ.16,000లకు పెంచుతూ మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. టికెట్లు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజరూపం బయట పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ను రూ.10 కోట్లకు అమ్ముకున్నారని ఆ పార్టీ నాయకులే ఢిల్లీ, గల్లీల్లో నిరసనలు తెలుపుతున్నారన్నారు.
పీసీసీ అధ్యక్షుడు ఆనాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికితే, ప్రస్తుతం నోట్లకు సీట్లు అంటూ అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చెబుతున్నారన్నారు. ప్రధాని పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారన్నారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను నిలిపివేసి, అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. ప్రధాని ఢిల్లీలో తెలంగాణను మెచ్చుకుని, రాజకీయం కోసం గల్లీల్లో తిట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్ర ఆదాయన్ని పెంచడం దాన్ని ప్రజలకు పంచడం సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి అధికారం ఇవ్వాలని అడుగుతున్నారని, గతంలో 11 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేసి, ప్రజల మనసులు గెలుచుకున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్భాస్కర్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సుమారు 500 మంది యువకులకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో భారీగా చేరుతున్నారన్నారు. కేసీఆర్ సబ్బండ వర్గాలకు సానుకూలంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. ఇన్నాళ్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వాల మాయమాటలు నమ్మి మోసపోయిన యువత, నేడు నీచపు రాజకీయం నుంచి విముక్తి పొందుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి అండగా నిలుస్తుందన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేసి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. పార్టీ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమైందన్నారు. పార్టీలో చేరిన 500 మంది యువకులు రానున్న ఎన్నికల్లో 50వేల ఓట్లు వేయించేందుకు కృషి చేయాలని చీఫ్ విప్ కోరారు. కాంగ్రెస్, బీజేపీ చేసిన అరాచకాలు, నీచపు రాజకీయాలను ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని బీఆర్ఎస్ గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పశ్చిమ కన్వీనర్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.