మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 2 : పంటలను ఎండబెట్టి రైతులను కాంగ్రెస్ దగా చేసిందని ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత విమర్శించారు. రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, హరిప్రియ నాయ క్, శంకర్ నాయక్తో కలిసి మానుకోట కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్కు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పలు చోట్ల దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఓ పక్క రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రె స్ నాయకులు వికృతానందం పొందుతున్నారని, ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు హామీలను అమలు చేయకుండా పబ్బం గడుపుకొంటోందన్నారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను కాంగ్రెస్ గోస పెడుతున్నదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో పుష్కలంగా సాగునీరు అంది రెండు పంటలు పండించిన రైతులను కాంగ్రెస్ అరిగోస పెడుతోందన్నారు. రైతులను మోసం చేసే విధానాలు అవలంబిస్తే ఊరుకునేదే లేదని, బీఆర్ఎస్ తరఫున రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బీరవెల్లి భరత్ కుమార్రెడ్డి, మర్రి రంగారావు, ఎండీ ఫరీద్, బానోత్ రవి కుమార్, బజ్జూరి పిచ్చిరెడ్డి, నజీర్, యాకుబ్రెడ్డి, మందుల రఘు, హరి నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో ప్రభుత్వం సాగు నీరు అందించకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు.