సంగెం, ఫిబ్రవరి 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేవుడిచ్చిన వరమని కలెక్టర్ గోపి అన్నారు. సంగెం, గీసుగొండ గ్రామాల దళితబంధు లబ్ధిదారులకు బుధవారం సంగెం ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దళితులకు ఎలాంటి షరతుల్లేకుండా వందశాతం సబ్సిడీతో ఈ పథకం అమలు చేస్తున్నదన్నారు. లబ్ధిదారులు డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లాలో నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేశామని, రెండో విడుతలో 3వేల మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రతి గ్రామం నుంచి 15 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రూ.30 కోట్ల్లు మంజూరయినట్లు తెలిపారు. లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లు తీసి రూ.10లక్షలు జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, దళితబంధు ప్రత్యేకాధికారి బాలకృష్ణ, ఎల్డీఎం సత్యజిత్, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సంగెం, గీసుగొండ ఎంపీడీవోలు మల్లేశం, రమేశ్, తహసీల్దార్ రాజేంద్రనాథ్, సర్పంచ్లు గుండేటి బాబు, దౌడు బాబు, ఎంపీటీసీ మల్లయ్య, లబ్ధిదారులు తదిత రులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : వివిధ శాఖల్లో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. కలెక్టరేట్లోఅధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలపై ఆడిట్ అభ్యంతరాలు అధికంగా ఉన్నాయన్నారు. పది రోజుల్లో వాటికి నిర్ణీత నమూనాలో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ప్రతి సోమవారం పెండింగ్ ఆడిట్ పేరాలపై శాఖల వారీగా సమీక్ష ఉంటుందన్నారు. జిల్లా అడిట్ అధికారి దేవేందర్, జిల్లా పరిషత్ సీఈవో రాజారావు, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప పాల్గొన్నారు.
మండల పంచాయతీ అధికారుల డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. మండల పంచాయతీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, కార్యదర్శి కూచన ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 27న పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గోపి అన్నారు. కలెక్టరేట్లో టాస్క్ఫోర్స్, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. పల్స్ పోలియో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0-5 ఏళ్ల లోపు పిల్లలు జిల్లాలో 50,976 మంది ఉన్నారన్నారు. 410 బూత్లు, హైరిస్క్ ఏరియాలు 65 ఉన్నాయన్నారు. అలాగే 17 మొబైల్ టీమ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు ఇంటింటా సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వేయాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పల్స్ పోలియోను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, డీఎంహెచ్వో వెంకటరమణ, ఇమ్యూనైజేషన్ అధికారి ప్రకాశ్, సర్వేలైన్స్ అధికారి ప్రశాంత్, డీఈవో వాసంతి, డీటీఈవో జహీరుద్దీన్, సీడీపీవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.