ములుగు, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ) : మేడారం జాతర అభివృద్ధికి వంద ఎకరాల భూసేకరణ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే 50 ఎకరాలు పూర్తయిందని, మరో 50 ఎకరాల కోసం రైతులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియా పాయింట్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. చరిత్ర పరిశోధకులు సమ్మక్క-సారలమ్మల పూజారుల సహకారంతో తల్లుల వాస్తవ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా శిలాశాసనాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ శాశ్వత అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామన్నారు.
రద్దీ లేకుండా నేటి నుంచి భక్తులకు బంగారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. తల్లుల దర్శనానికి సీఎంతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్ రానున్నారని చెప్పారు. అభివృద్ధి పనులను 2025 మినీ జాతర నాటికి పూర్తి చేయనున్నట్ల మంత్రి వివరించారు.