PM Modi : గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026 (CWG-2026) లో భారత బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 39 పతకాలు (39 Medals) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో భారత పతక విజేతలతో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. మీ విజయాలు దేశానికి గర్వకారణమని, రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని ప్రధాని కొనియాడారు.
ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మొత్తం 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలువగా.. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, షూటింగ్ వంటి కీలక క్రీడాంశాలు ఈసారి లేకపోయినా భారత అథ్లెట్లు ఈ స్థాయిలో రాణించడం విశేషం. ముఖ్యంగా పారా-అథ్లెట్ల ప్రదర్శనను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘మీరు కేవలం పతకాల సంఖ్యను పెంచలేదు, యావత్ తరాన్ని సిద్ధం చేశారు. పాఠశాలలకు వెళ్లి మనం చెప్పే మాటల కన్నా, మీ పతకాలు పిల్లల్లో ఎక్కువ స్ఫూర్తిని నింపుతాయి’ అని అన్నారు.
ఈసారి గేమ్స్లో భారత బాక్సర్లు సంచలనం సృష్టించారు. ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలు సాధించి సత్తా చాటారు. ముఖ్యంగా మహిళా బాక్సర్ల ప్రదర్శన అత్యుత్తమంగా నిలిచింది. భారత బాక్సర్ల వీడియోలు చూసి ప్రపంచ బాక్సర్లు ఇప్పుడు భయపడుతున్నారని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే జూడోలోనూ భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అస్మితా డే, హర్ష్ సింగ్ స్వర్ణాలు గెలిచి కామన్వెల్త్ గేమ్స్ జూడోలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ, పురుష అథ్లెట్లుగా రికార్డు సృష్టించారు.
ఖేలో ఇండియా పథకం ద్వారా వచ్చిన ఈ క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని అన్నారు. అథ్లెటిక్స్లోనూ గుల్వీర్ సింగ్ ఒకే గేమ్స్లో రెండు పతకాలు (10 వేల మీటర్లు రజతం, 5 వేల మీటర్లు కాంస్యం) సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. ఈ సమావేశంలో వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుతో ప్రధాని మోదీ మాట్లాడిన సందర్భం భావోద్వేగంగా మారింది. తన కష్టాలను, పోడియంపై నిల్చున్నప్పుడు కలిగిన అనుభూతిని తలుచుకుని మీరాబాయి కంటతడి పెట్టారు.
దాంతో ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘నీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం’ అని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ విజయాలు కొనసాగించాలని ఆశీర్వదించారు.