AP News | ప్రేమించిన యువతి తనను పట్టించుకోవడం లేదన్న అనుమానంతో ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద హసీనా అనే యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన బాలసైదులు.. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన హసీనాకు గుంటూరు జిల్లాలో మిట్టపల్లి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ కాలేజీలో చదువుతున్న సమయంలో బాలసైదులుతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. బీటెక్ పూర్తయ్యాక హసీనా సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరింది. బాలసైదులు సొంత గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి బాలసైదులుతో ఆమె మాట్లాడటం తగ్గించింది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్న బాలసైదులు.. హత్యకు పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో హసీనాను కారంపూడికి రప్పించిన బాలసైదులు.. ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు హసీనా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద సగం కాలిన మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది హసీనాదేనని గుర్తించారు.
కేసు దర్యాప్తులో భాగంగా బాలసైదులును అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.