వానకాలం సాగుకు సిద్ధమవుతున్న సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థికసాయం అందుతుండడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. పెట్టుబడి డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతుండడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. మూడో రోజు బుధవారం మూడెకరాల భూమి ఉన్న వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. పెట్టుబడి సాయం వచ్చినట్లు ఫోన్కు మెస్సేజ్లు వస్తుండడంతో కర్షకులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. నగదు విత్డ్రా చేసుకొని ఉత్సాహంగా పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16,344 మంది రైతులకు రూ.22.88 కోట్లు, ములుగులో 25,461 మందికి రూ. 27.47 కోట్లు, వరంగల్లో 23,631 మందికి రూ.28.89 కోట్లు, హనుమకొండలో 1,15,444 మందికి రూ.70.69 కోట్లు, మహబూబాబాద్లో 1,13,857 మందికి రూ.57.83 కోట్లు, జనగామలో 85, 845 మందికి రూ. 25.75 కోట్లు జమయ్యాయి.
– నమస్తే నెట్వర్క్, జూన్ 28
పెట్టుబడికి సరిపోతున్నయ్
కాళేశ్వరం: గప్పట్ల వర్షాలు ఆలస్యమయ్యేటివి. ఎవుసం కోసం సుట్టాల దగ్గరకు పోయి పెట్టుబడి కోసం వడ్డీలకు అప్పులు తెచ్చేటోళ్లం. పంట పండకపోతే మళ్ల అప్పు జేయాల్సి వచ్చేది. కేసీఆర్ సర్కారు అచ్చినంక ఇప్పుడు రంది లేకుండ వోయింది. పంట కోసం ఇంకొకర్ని అడిగే అక్కర్లేకుండ సారే పెట్టుబడి సాయం జేత్తాండు. బేంకుల పైసలు పడ్డయనంగనే సంబురమైతాంది. ఆ పైసలు పంటపెట్టుబడికి సరిపోతున్నయ్.
– రేవెల్లి లచ్చులు, కాళేశ్వరం
తిప్పలు తప్పినయ్..
టేకుమట్ల: కేసీఆర్ సార్ పెట్టుబడి పైసలియ్యడంతో అప్పుల తిప్పలు తప్పినయ్. నాడు అడ్తిదారు దగ్గర అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టేటోళ్లం. పంట తీయంగనే అమ్మి అసలు, వడ్డీ కలిపి అంత అడ్తిదారే కట్ చేసుకుంటే కూళ్ల పైసలు కూడా రాకపోయేది. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పైసలతో విత్తనాలు, ఎరువులు కొని పంట వేస్తు న్నం. తిరిగి అసలు, వడ్డీ కట్టుడు కూడా లేదు. ఇంతకన్నా రైతుకు ఏంగావాలె?. కరంట్, నీళ్ల వసతులు, పంటలు కొనుడు కూడా సర్కారే చేత్తాంది. ఇయ్యాల రూ.11 వేలు తీసుకున్న. వాటితో మందు బస్తాలు కొనుక్కొని పోత. ఇన్నేళ్ల సంది ఏ సర్కారు కూడా రైతులను పట్టించుకోలే. సర్కారు సాయం ఎప్పుడూ మరువ.
– తిప్పిరెడ్డి సరోత్తంరెడ్డి, రైతు, పంగిడిపల్లి
రైతులకు వరం..
పలిమెల: సీఎం కేసీఆర్ ఇస్తున్న పెట్టుబడి సాయం రైతులకు వరం లాంటిది. సమయానికి రైతు బంధు పైసలు ఇచ్చి ఆదుకుంటాండు. గతంతో సాగు శాన కష్టంగ ఉండేది. ఇప్పుడు ఇష్టంతో చేత్తాన్న. 2.20 ఎకరాల భూమిల పత్తి, మిరప పంట పండిత్తాన్న. వానకాలం పెట్టుబడి సాయం రూ.12,500 నా బ్యాంకు ఖాతాల పడ్డయ్. ఎరువులు, విత్తనాలు తెచ్చుకొని ఎవుసం పనులు మొదలు పెడ్త. గతంలో ఏ సర్కారు సుత రైతులకు సాయంజెయ్యలే. పెట్టుబడి అందిస్తున్న సీఎం కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుంటం.
– బిలుగు కోటేశ్వర్, లెంకలగడ్డ
సమయానికి అందింది..
వర్ధన్నపేట: రైతుబంధు సాయం సమయానికి అందింది. నాకున్న ఎకరం భూమిలో వరి పంట వేస్తాన. నారు మడి దున్నుకొని విత్తనాలు కొన్న. రెండు రోజుల్లో మండె కట్టుకొని నారు పోసుకుంట. ఈ సమయంలోనే నాకు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద రూ.5వేల ఆర్థిక సాయం అందించింది. విత్తనాల కొనుగోలు, పొలం దున్నుడుకు నేను గతంల అప్పు తెచ్చుకునేటోన్ని, కానీ అదునుకు ప్రభుత్వం ఐదువేలు ఇచ్చింది. దీంతో నేను అప్పు తెచ్చుకునే అవసరం లేకుంటనే పొలం దున్నుకొని నాట్లు వేసుకుంట. కష్టపడి పంట పండించుకుంటే ధాన్యం అమ్మిన పైసలు నా కుటుంబ అవసరాలు, పిల్లల చదువుకు ఉపయోగపడుతై. గతంల అయితే అప్పులు కట్టడానికే సరిపోయేది.
– మానుక రాజు, ఇల్లంద (వర్ధన్నపేట)
ధీమాగా ఉన్నం..
నల్లబెల్లి: నాడు దగా పడ్డం. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతోటి ధీమాగా ఉన్నం. నాకు 1.31 ఎకరాల భూమున్నది. రూ. 8,770 బ్యాంక్ అకౌంట్ల పడ్డయ్. బుధవారం బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్న. పంట పెట్టుబడి కోసం రైతులు తండ్లాడకుంట అదునుకు సీఎం కేసీఆర్ అందించిన రైతుబంధు పైసలు చేతికంది అందరం సంతోషంగ ఉన్నం. ఎస్సారెస్పీ నీళ్లు, రంగాయ చెర్వులో గోదావరి నీళ్లు పుష్కలంగ ఉన్నయ్. 65 ఏళ్ల నుంచి ఎన్నడు ఎండకాలంల చెర్వులు మత్తడి పడింది సూడలే. ఈ టైంల చెర్వులు, కుంటల్ల నీళ్లు నిండుగ ఉన్నయంటే అది సీఎం కేసీఆర్ చలువే. 24 గంటల కరంట్తోని ఏటా రెండు పంటలు పండించుకుంటున్నం. బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉండి కేసీఆర్ సారు రుణం తీర్చుకుంటం. – మహ్మద్ అఫ్జల్, నల్లబెల్లి
తెలంగాణ వచ్చినంకనే బాగుపడుతున్నం..
వేలేరు: తెలంగాణ వచ్చినంకనే రైతులు బాగుపడుతున్నరు. నాకు రెండెకరాల భూమున్నది. రైతుబంధు పైసలు రూ.10వేలు అకౌంట్ల పడ్డయ్. వాటిని పెట్టుబడి ఖర్చులకు వాడుకుంటున్న. వర్షాలు పడుతాన్నయ్.. ఎవుసం పనులు మొదలువెట్టినం. ఈ పైసలు ఇత్తనాలు, పత్తి గింజలకు అక్కరకొస్తయ్. అదునుకు సీఎం కేసీఆర్ ఆదుకోకపోతే పెట్టుబడికి శాన ఇబ్బందయ్యేది. అప్పు చేయాల్సి వచ్చేది. ఎన్కట రైతుల నుంచే భూమి శిస్తు వసూలు చేసి పీడించేటోళ్లు. పంటలు పండినా, పండక పోయినా కట్టుమనేటోళ్లు. కానీ కేసీఆర్ సార్ రైతులకే ఉల్టా డబ్బు సాయంజేత్తాండు. ఇప్పుడు పంటలు బాగ పండుతాన్నయ్. కాలం సుత మంచిగైతాంది. కేసీఆర్ సార్ కంటే మంచి చేసినోళ్లు ఎవ్వల్లేరు. మళ్ల ఆయనే గెలవాలె.
– గుడూరు సాంబయ్య, రైతు, కమ్మరిపేట తండా
టైముకు డబ్బులు పడ్డయ్..
ఐనవోలు: నాకు ఎకరం 35 గుంటల భూమి ఉంది. రైతుబంధు పైసలు రూ.9500 నా ఖాతాల పడ్డయ్. టైముకు పంట పెట్టుబడి డబ్బులు వచ్చినయ్. వీటితో విత్తనాలు, ఎరువులు కొంట. గతంల పెట్టుబడి కోసం అప్పులు చేసేటోళ్లం. ఇప్పుడు కేసీఆర్ అందిస్తున్న పంట పెట్టుబడి కోసం బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటున్నం. అప్పట్ల అదునుకు పైసలు దొర్కక పెట్టిన పంటకు నష్టం జరిగేది. కానీ ఇప్పుడు ముందుగానే డబ్బులు ఖాతాల జమైతానయ్. రైతుకు ఆసరాగా నిలుస్తున్న కేసీఆర్కు రుణపడి ఉంటం.
– కాటబోయిన కుమారస్వామి, కక్కిరాలపల్లి
రూ. 15వేలు అకౌంట్ల పడ్డయ్..
నెక్కొండ: నా పేరిట 3 ఎకరాల భూమున్నది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇచ్చిన రూ.15వేలు అకౌంట్ల పడ్డయ్. రైతాంగాన్ని ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్. గతంలో పంట పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు పడేటోళ్లం. వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తెచ్చుకునేటోళ్లం. సీఎం కేసీఆర్ పుణ్యమాని ఇప్పుడు రైతులకు ఆ ఇబ్బందుల్లేవు. ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి అందించడం చాలా గర్వించదగిన విషయం.
– బోళ్ల భూపాల్, అప్పల్రావుపేట(నెక్కొండ)
కేసీఆరే ఆదుకుంటున్నడు
దుగ్గొండి: కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పైసలు అదునుకు ఎంతో అక్కరకు వత్తానయ్. వచ్చిన డబ్బులతో దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నం. ఎరువులు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నయ్. వాటి గురించి బాధలేదు. పంటల పెట్టుబడికి ప్రభుత్వమే డబ్బులిస్తుండడంతో రంది తీరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు పెట్టి మమ్ములను ఆదుకుంటాండు. కరంట్, సాగునీరు అందిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– మట్టెవాడ చింటు, రేకంపల్లి