పర్వతగిరి, మార్చి 4 : పండుగ సంబురంలో మునిగిన ఆ తండాలో ఒక్కసారిగా తీరని విషాదం అలుముకుంది. దుర్గమ్మ వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాతపడడం ఉమ్మడి జిల్లావాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యాతండాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘోరం అందరినీ కలిచివేసింది. పర్వతగిరి మండలం మోత్యాతండాలో సోమవారం రాత్రి విద్యుత్ వైరు తెగిపడి ముగ్గురు మృత్యువాతపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాలో దుర్గమ్మ పండుగను జరుపుకొనేందుకు తండావాసులు ఏర్పాట్లు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఎవరికి వారు బోనాలు చేసుకొని మంగళవారం పండుగ జరుపుకొనేందుకు బంధువులను పిలుచుకున్నారు. తమ ఇండ్ల ముందు టెంట్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 8గంటల సమయంలో తండాకు చెందిన భూక్య రవి(30) టెంట్ వేస్తుండగా విద్యుత్ వైరు తెగి అతడి ఇంటి ముందు పడింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి బావ రాయపర్తి మండలం గట్టికల్కు చెందిన గుగులోత్ దేవేందర్(32), టెంట్ వేసేందుకు వచ్చిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాన్పురానికి చెందిన సునీల్(20) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దవాఖానకు తీసుకెళ్తుండగా రవి మార్గమధ్యలో చనిపోయాడు. రవి కొడుకు నాలుగేళ్ల చిన్నారి జశ్వంత్ తీవ్ర గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురి మృతితో తండాలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓవర్ లోడ్తో తీగలు తెగి పడ్డాయని, గతంలో ఓవర్లోడ్ విషయమై అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తండావాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు.