హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి 19 : నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. పంట సాగుకోసం సబ్సిడీ ఇస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. దీంతో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆయిల్పామ్ను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లాలో సైతం సాగు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జిల్లాలో ఆయిల్పామ్ సాగుచేసేందుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్థలం కొరత వల్ల ఏజెన్సీ సంస్థకు పూర్తిస్థాయి మొక్కల సరఫరా కొంతమేర ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో 2021-22 సంవత్సరానికి 1100 ఎకరాల ఆయిల్పామ్ సాగు లక్ష్యం నిర్దేశించగా అది 100శాతం పూర్తయింది. జిల్లాలో ఎకరాకు 56 మొక్కల చొప్పున 62,500 మొక్కలను రైతులు నాటారు. అయితే ఇంకా మొక్కలకు డిమాండ్ ఉంది. ఈ మొక్కల కొరత తీర్చేందుకు స్థానికంగా ఖాళీ జాగ పెద్ద మొత్తంలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్ స్థలాన్ని కేటాయించి ఖైదీలతో నర్సరీ నిర్వహించేందుకు ఏజెన్సీ సంస్థ జైళ్ల శాఖను సంప్రదించింది.
సాధ్యాసాధ్యాల అనంతరం..
ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తూ సెంట్రల్ జైలును మామునూరు పోలీసు బెటాలియన్కు తరలించింది. అక్కడ 101 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. ఇందులో నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఖైదీలను పలు జైళ్లకు తరలించింది. అయితే ఇందులో కొంతమంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఇక్కడే ఉంచారు. వీరు జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇతర పనులు చూసుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయిల్పామ్ నర్సరీ నిర్వహణ ఆఫర్ వచ్చింది. దీంతో జైళ్ల శాఖ అధికారులు అన్ని కసరత్తులు చేశారు. ఈమేరకు అధికారుల బృందం భారీ ఎత్తున ఆయిల్పామ్ సాగు చేస్తున్న ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ప్రాంతానికి రెండు సార్లు వెళ్లి వచ్చింది. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో ఇవ్వగా, ఖైదీలు ఆయిల్పామ్ నర్సరీ నిర్వహించగలరని నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత శాఖ తరపున న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం హనుమకొండ జిల్లా ఆయిల్పామ్ ఏజెన్సీ సంస్థ అయిన కేఎన్ బయోసైన్సెతో ఎంవోయూ (మెమోరెండం ఆఫ్ అండర్స్టాండింగ్)ను కుదుర్చుకుంది. ఖైదీలకు శిక్షణ కూడా ఇచ్చారు.
ఖైదీలకు మంచి ఉపాధి మార్గం
ఖైదీలకు, రైతులకు ఉభయతారకంగా ఉపయోగపడే సెంట్రల్ జైల్లో ఆయిల్పామ్ మొక్కల పెంపకం పనులు జైలు ఆవరణలో మొదలయ్యాయి. నర్సరీ నిర్వహణ కోసం జైలు ఆవరణలో 21 ఎకరాలు కేటాయించారు. ఇందులో ప్రైమరీ నర్సరీ కోసం ఎకరం విస్తీర్ణంలో షేడ్ నెట్ను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా మల్లంపల్లి నుంచి ఎర్రమట్టిని, ఎరువులను తెప్పించి చిన్న ప్లాస్టిక్ కవర్లలో నింపి నెట్లో మల్చింగ్ పేపర్పై అమర్చుతున్నారు. విత్తనం రాగానే కవర్లలో విత్తే పని మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక సెకండరీ నర్సరీ కోసం కూడా భూమిని చదును చేసి ఉంచారు. ఈ ఆయిల్పామ్ నర్సరీలో ఇప్పుడు 35మంది ప్రతిరోజూ పని చేసేందుకు అనుమతించారు. మరో 15మంది కోసం కూడా పర్మిషన్ అడిగారు. ఈ నర్సరీలో 3 లక్షల మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో పనిచేసే ఖైదీలకు నిత్యం రూ.150 చెల్లిస్తారు. ఈ డబ్బులను ఖైదీల పీపీసీ(ప్రిజనర్ పర్సనల్ క్యాష్)లో జమ చేస్తారు. ఖైదీలు వ్యక్తిగతంగా గానీ, వాటిని వారి కుటుంబసభ్యులకు గానీ ఇవ్వచ్చు. తద్వారా జైల్లో శిక్ష అనుభవించే ఖైదీలకు కొంత ఆదాయం సమకూరుతుంది.
ఇక మొక్కల కొరత ఉండదు
జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేసేందుకు చాలామంది రైతులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే జిల్లా లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు నర్సరీ కోసం సప్లయ్ ఏజెన్సీ వాళ్లు జైళ్ల శాఖతో నర్సరీ నిర్వహణ ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది విధించే లక్ష్యానికి మొక్కల కొరత ఉండకపోవచ్చు. రానున్న రోజుల్లో కూడా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ నర్సరీలను నిర్వహించినట్లయితే రైతులకు సమయానికి మొక్కలను అందింవచ్చు.
– శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
ఖైదీలకు ఉపాది దొరుకుతుంది
సెంట్రల్ జైల్ ఆవరణలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ఉపాధి కోసం వృత్తి నైపుణ్యం ఉన్న పనులు చేయిస్తాం. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఆయిల్పామ్ నర్సరీ నిర్వహించే అవకాశం వచ్చింది. ఇందుకోసం మా ఖైదీలకు అవసరమైన శిక్షణ ఇప్పించాం. ఈ నర్సరీ ద్వారా రైతులకు సకాలంలో మొక్కలను అందించడంతో పాటు మా ఖైదీలకు మంచి ఉపాధి దొరుకుతుంది. నర్సరీ కోసం జైలు ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– మందారపు సంపత్, సూపరింటెండెంట్, వరంగల్ సెంట్రల్ జైల్
మంచి అవకాశంగా భావిస్తున్నా..
మా జైలు ఆవరణలో ఆయిల్పామ్ మొక్కలు పెంచడం వల్ల మాకు రైతులకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నాం. ఈ పని చేయడం వల్ల మేం సత్ప్రవర్తనతో ఉండేందుకు కావాల్సిన మార్కులు పడతాయి. మమ్మల్ని విడుదల చేసేందుకు అవకాశాలు కూడా వస్తాయి. ఈ పని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మేం ఉపయోగించుకోవడంతో పాటు మా ఇంట్లో వాళ్లకు కూడా పంపించుకుంటం.
– మాడిశెట్టి విజేందర్, ఖైదీ