ఖిలావరంగల్/సంగెం, ఫిబ్రవరి 28: జిల్లాలో నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. ఆయిల్ పామ్ సాగుపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. మండలాలవారీగా ఆయిల్ పామ్ సాగుపై వ్యవసాయ ఉద్యానవన, విస్తరణ అధికారులతో చర్చించారు. జిల్లాలో 4,018 ఎకరాల లక్ష్యానికిగాను 2,496 ఎకరాల్లో సాగును రైతులు చేస్తున్నారని ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఆర్ శ్రీనివాస్రావు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ విస్తరణ అధికారులు ఒక్కొక్కరు కనీసం 20 ఎకరాల అనువైన భూములను గుర్తించి సంబంధించిన రైతులతో మాట్లాడి ఆయిల్ పామ్ సాగుకు సిద్ధం చేయించాలన్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఆయిల్ పామ్ సాగుకు సన్నద్ధం కావాలన్నారు.
వచ్చే వారం సంగెం మండలం రామచంద్రపూర్లోని ఆయిల్ పామ్ నర్సరీలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. డీఏఓ ఉషాదయాల్తోపాటు అధికారులు పాల్గొన్నారు. కాగా, సంగెం మండలం రాంచంద్రాపురంలోని ఆయిల్ పామ్ నర్సరీని కలెక్టర్ గోపి మంగళవారం సందర్శించారు. ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించి, ఎకరానికి ఎన్ని మొక్కలు నాటాలి? ఏమేరకు రైతుకు దిగుబడి వస్తుందనే వివరాలను హార్టికల్చర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రైతు గోవర్ధన్ సాగుచేస్తున్న ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించారు. అంతర్గత పంటలు వేసుకొని కూడా లాభాలు పొందవచ్చని రైతు వివరించాడు. సంగెం మండలంలోని 16 గ్రామాల్లో 96మంది రైతులు 278 ఎకరాల్లో 16,062 మొక్కలను నాటినట్లు నర్సరీ నిర్వాహకులు తెలిపారు. ఎంపీపీ కందకట్ల కళావతి, హార్టికల్చర్ జిల్లా అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ అధికారులు తిరుపతి, శంకర్, ఎంపీడీఓ కొమురయ్య, ఏఈఓ సాగర్, దిలీప్రావు పాల్గొన్నారు.