వరంగల్, మే 12 : చారిత్రక నగరం ఓరుగల్లు ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారికి మాడ వీధుల హారాన్ని అలంకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాకతీయుల కాలం నాటి భద్రకాళి గుడి చుట్టూ మాడవీధులు, ప్రాకారం, నలువైపులా రాజగోపురాలతో ఇక ఆలయం శోభాయమానంగా వెలిగిపోనున్నది. రూ.30కోట్లతో చేపట్టే నిర్మాణాల కోసం మరో వారం పది రోజుల్లో అధికారులు టెండర్లు పిలువనున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నది.
ఇందులో భాగంగానే వరంగల్ భద్రకాళీ అలయం చుట్టూ మాడవీధుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.30కోట్లు మంజూరు చేసింది. వారం క్రితం మాడ వీధుల నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్థపతి సూచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం భద్రకాళీ అలయం చుట్టూ మాడవీధుల నిర్మాణం చేపట్టేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) అధికారులు సిద్ధమవుతున్నారు. మరో వారం పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. చుట్టూ మాడవీధులు, ప్రాకారం నిర్మాణంతో ఆలయానికి కొత్తకళ రానుండగా, అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మాడవీధుల్లో ఇక అంగరంగ వైభవంగా జరగనుంది.
చెరువును అనుకొని..
అలయం చుట్టూ 33 ఫీట్ల వెడల్పుతో 830 మీటర్ల మేరకు మాడ వీధులు నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ ప్రాకారం కట్టనున్నారు. సుమారు 100 మీటర్ల వరకు భద్రకాళి చెరువు నుంచి మాడ వీధులను నిర్మించేలా ప్రణాళికలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆలయం పక్కనే ఉన్న పూజారి నివాసం, యాగశాల, వంటశాల, అన్నదాన సత్రం, వేద పాఠశాలతో పాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ధార్మిక భవనాన్ని తీసివేసి వీటిని ఆ లయ ప్రాకారం బయట కొత్తగా నిర్మించనున్నారు. ఇక్కడ నిర్మాణాల కోసం స్థపతి జ యానంద్ పలుమార్లు ఆలయానికి వచ్చి అధికారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు.
9 అంతస్తులతో రాజగోపురాలు
ఆలయం నలుదిక్కులా తొమ్మిది అంతస్తుల రాజగోపురాలు కట్టనున్నారు. ఇందుకోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ సుమారు రూ.9కోట్లు కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.20కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నుంచి రూ.10కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టనున్నారు. మాడవీధుల డీపీఆర్ను హైదరాబాద్కు చెందిన రుక్కీ కన్సల్టెన్సీ రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. మరో వారం పది రోజుల్లో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. మాడవీధులు, ప్రాకారంతో పాటు ఆలయ ప్రాంగణంలో గ్రీనరీ, ఇతర సుందరీకరణ పనులు చేస్తామని చెప్పారు.