రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఇబ్బందులకు గురి కావొద్దనే ఉద్దేశంతో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించింది.
రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు
కొనుగోలు కేంద్రాల్లోని తూకమే ఫైనల్
పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటు
ఇప్పటికే ఓ రైస్ మిల్లుకు షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు
హనుమకొండ, మే 18 : రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఇబ్బందులకు గురి కావొద్దనే ఉద్దేశంతో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం విషయంలో కొందరు మిల్లర్లు సాకులు చూపుతూ ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి పెద్ద మొత్తంలో తరుగు తీస్తున్నారని రైతులు మొత్తుకుంటున్నారు. జిల్లా యంత్రాంగానికి, సర్కారుకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొన్నది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకమే ఫైనల్ అని, తేమ, మట్టి, తాలు పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయినప్పటికి కొందరు మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. అలాగే మరి కొందరు ధాన్యం దింపడంలో కూడా అలసత్వం వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తరుగు, ధాన్యం దిగుమతి విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు చేసేందుకు టాస్క్ఫోర్సు కమిటీలు సైతం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
రైతలు నుంచి ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే సదరు మిల్లర్లను హెచ్చరించడంతో పాటు చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా నాగారం సమీపంలోని సప్తగిరి రైస్ మిల్లర్ ఎక్కువ తరుగు తీస్తున్నట్లు ఫిర్యాదు వచ్చింది. క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారులు తనిఖీ చేయగా నిజమని తేలడంతో షోకాజ్ నోటీసు జారీ చేశాం. రైతులకు ఇబ్బందులకు కలుగకుండా చూస్తాం. మరి కొందరు మిల్లర్లు ధాన్యం దింపే విషయంలో వెనకడుగు వేస్తే దింపుకోవాలని హెచ్చరించాం. తరుగు కూడా తీయొద్దని ఆదేశించాం. రైతులు కూడా ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
షోకాజ్ నోటీసు..
జిల్లాలో తరుగు విషయంలో అత్యాశకు పోయిన రైస్ మిల్లుల యజమానులపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలకు పూనుకున్నది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన తర్వాత కూడా కొందరు మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేశారు. తరుగు పేరుతో రైస్మిల్లరు దోపిడీకి పాల్పడుతున్నట్లు తేలడంతో నాగారం సమీపంలోని సప్తగిరి రైస్ మిల్లు యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ మిల్లుకు ధాన్యం తరలించడం నిలిపివేశారు. షోకాజ్ నోటీసుకు రైస్ మిల్లు యజమాని వివరణ ఇచ్చిన తర్వాత కలెక్టర్ సూచనలు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటున్నాం.