వరంగల్, నవంబర్ 8(నమస్తేతెలంగాణ) : నాసి రకం వరి విత్తనాలపై అధికారులు దృష్టి సారించారు. వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధ్యులైన విత్తన విక్రయదారులపై చర్యలకు ఉపక్రమించా రు. ఇప్పటికే ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాల అమ్మకానికి తెరదించింది. ఏటా వానకాలం, యాసంగి సీజ న్ ఆరంభంలోనే వివిధ ప్రభుత్వ శాఖలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకొంటున్నది. అనుమతి లేని, నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాల విక్రయం జరగకుండా గ్రామాల్లో నిఘా పెట్టడంతో పాటు విత్తన దుకాణాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని విత్తన డీలర్లపైనా కొరడా ఝలిపిస్తున్నాయి.
అనుమతి లేని విత్తన నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నాయి. తనిఖీ లు, నిఘాతో మార్కెట్లో నాసిరకం విత్తనాల విక్రయానికి ఫుల్స్టాప్ పడింది. ఫలితంగా రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 2014కు ముందు నకిలీ విత్తనాలతో జరిగిన పంట నష్టాలు గత ఎనిమిదేళ్లుగా లేవు. అప్పుడప్పుడు ఎక్కడైనా వివిధ కారణాలతో విత్తనాల వల్ల పంట దిగుబడులపై ప్రభావం పడుతున్నట్లు దృష్టికి వ స్తే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలకు పూనుకుంటున్నది.
అధికారులను రంగంలోకి దింపి బాధిత రైతు ల పక్షాన నిలుస్తోంది. తాజాగా చెన్నారావుపేట మండలంలో ఇదే జరిగింది. ఇక్కడి ఎల్లాయిగూడెం, చెరువుకొమ్ముతండా, అమృతండా, పదహారు చింతల్ తండా కు చెందిన రైతులు ఈ ఏడాది వానకాలం సీజన్ కోసం ఇటీవల వరంగల్లోని రెండు విత్తన దుకాణాల్లో ఓ కంపెనీకి చెందిన వరి విత్తనాలు (240 బస్తాలు) కొనుగోలు చేశారు. వీటిని సుమారు 200కు పైగా ఎకరాల్లో నాటారు. తీరా పంట ఎదుగుదల లేకపోవడం, సరిగా కంకి పెట్టకపోవడం, వరిలో బెరుకులు ఉండడం, గొట్టం రోగం రావడం తదితర కారణాలతో దిగుబడిపై ప్రభావం పడనుందని గుర్తించిన బాధిత రైతులు వ్యయసాయ శాఖ అధికారులను సంప్రదించారు. కలెక్టర్ గోపి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఉషాదయాళ్ను కలిసి తాము కొనుగోలు చేసిన వరి విత్తనాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, దిగుబడి వచ్చే అవకాశం లేద ని, తమకు వరి విత్తనాలు విక్రయించిన డీలర్లు, కంపెనీపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన..
రైతుల ఫిర్యాదుతో కలెక్టర్తో పాటు వ్యవసాయశాఖ అధికారులు వెంటనే స్పందించారు. తొలుత నర్సంపేట ఏడీఏ అవినాశ్వర్మ, చెన్నారావుపేట మండ ల వ్యవసాయ అధికారి అనితతో పాటు విస్తరణ అధికారులు ఎల్లాయిగూడెం, చెరువుకొమ్ముతండా, అమృతండా, పదహారు చింతల్ తండాను సందర్శించి దిగుబడిపై ప్రభావం పడనున్న వరి పంటను పరిశీలించి డీఏవోకు నివేదిక పంపారు. తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తలు వరి పంట నమూనాలు సేకరించారు. అనంత రం పంట దిగుబడిపై ప్రభావం పడడానికి దారి తీసిన కారణాలపై నివేదిక రూపొందించారు. వాతావరణ పరిస్థితులకు తోడు నాటిన వరి విత్తనాల్లో బెరుకులు ఉన్నాయని, తాలు గింజలవుతున్నాయని, గొట్టం రోగం ఆశించడంతో దిగుబడిపై ప్రభావం పడనుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నివేదిక ఆధారంగా వ్యవసాయశాఖ కమిషనర్ ఈ వరి విత్తన కంపెనీకి కొద్దిరోజుల క్రితం నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
విత్తనాలు విక్రయించిన వరంగల్లోని రెండు విత్తన దుకాణాల డీలర్లు, ఇక్కడ ఉన్న ఈ విత్తన డిస్ట్రిబ్యూటర్కు వ్యవసాయశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు అందజేశారు. కొద్దిరోజుల క్రితం సదరు విత్తన కంపెనీ ప్రతినిధులు పంటను పరిశీలించేందుకు చెన్నారావుపేట మండలంలోని నాలుగు తండాలకు వెళ్లగా రైతులు తమకు నష్ట పరిహారం చెల్లించాలని అడ్డుకున్నారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో కంపెనీ ప్రతినిధులను పంపించారు. అలాగే, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన రైతులు పలువురు సోమవారం నర్సంపేటలోని రెండు విత్తన దుకాణాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు నకిలీ వరి విత్తనాలు విక్రయించిన ఈ రెండు దుకాణాల విత్తన లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరి పంట కంకి పెట్టకుండా ఏపుగా పెరిగిందని, పంటను కోల్పోయిన తమకు పరిహారం ఇప్పించాలని నర్సంపేటలోని ఏడీఏ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దీనిపైనా విచారణ జరిపి చర్యలు తీసుకొనేందుకు వ్యవసాయశాఖలో కసరత్తు జరుగుతున్నది.
కల్తీ విత్తనాలతో మోసపోయాం.. న్యాయం చేయండి..
చెన్నారావుపేట : కల్తీ విత్తనాలతో మోసపోయాం.. మాకు న్యాయం చేయండని ఎల్లాయగూడెం తదితర గ్రామాల రైతులు వేడుకుంటున్నారు. మండలంలోని ఎల్లాయగూడెం, 16 చింతల తండా, బోడమానిక్యం తండా రైతులు కల్తీ విత్తనాలు అమ్మిన రాజా గోల్డ్ సీడ్స్, డీలర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. నాలుగు జీపీల పరిధిలో దాదాపు 260 ఎకరాల్లో ఈ విత్తనాలు సాగు చేశామని, రైతులను మోసగించిన షాపులు, సీడ్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మోహన్నాయక్, సుమన్, దంజ్యా, నరేశ్, బాబు తదితరులు పాల్గొన్నారు.