నర్సంపేట, డిసెంబర్ 2: నర్సంపేట శాసనసభ ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నర్సంపేట ఎన్నికల అధికారి కృష్ణవేణి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఏజెంట్లకు అవసరమైన గుర్తింపు కార్డులు అందజేసినట్లు వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని, అనంతరం ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారని వివరించారు. నర్సంపేట నియోజకవర్గంలో 87.87 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. మొత్తం 2,32,179 మంది ఓటర్లకు 2,04011 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు.
పటిష్ట భద్రతా నడుమ ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఆర్వో కృష్ణవేణి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలు, ఏర్పాట్లను ఎన్నికల అబ్జర్వర్ అనిల్ రామకృష్ణతో కలిసి పరిశీలించారు. జిల్లా పరిధి మాస్టర్ ట్రైనర్ పట్టాభితో కౌంటింగ్లో అనుసరించాల్సిన నియమ నిబంధనలపై కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపును 21వ రౌండ్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైళ్లు నిషేధమన్నారు. ఒక్కో టేబుల్కు ముగ్గురు చొప్పున మొత్తం 42 మంది ఉంటారని వివరించారు. వారిలో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆమె వెంట నర్సంపేట, నల్లబెల్లి తహసీల్దార్లు విశ్వప్రసాద్, రాజేశ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
కాశీబుగ్గ, డిసెంబర్ 2: వరంగల్ 14వ డివిజన్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల నియోజకవర్గాల కౌంటింగ్ ఉన్నందున చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మామునూరు ఏసీపీ సి.సతీశ్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లోకి జిల్లా రెవెన్యూ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. మార్కెట్లోకి సామాన్య ప్రజలకు అనుమతి లేదని, పరిసరాల్లో ఎవరూ గుమికూడొద్దని సూచించారు. అలాగే, ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదని పేర్కొన్నారు. గేట్ నంబర్-2 నుంచి లోనికి ప్రవేశం ఉందని, అభ్యర్థులు, పోలింగ్ కౌంటింగ్ స్టాఫ్, ఏజెంట్లు, పాత్రికేయులు గమనించాలని కోరారు. వారి వెంట తెచ్చుకున్న వాహనాలను మార్కెట్ పరిధిలోని పత్తి, మిర్చి, పల్లి యార్డుల్లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. అలాగే, కౌంటింగ్ హాల్లో సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. కాశీబుగ్గ నుంచి మొగిలిచెర్లకు వెళ్లే సామాన్య ప్రజల వాహనాలు బాలాజీనగర్ జంక్షన్ నుంచి వంద ఫీట్ల రోడ్డు ద్వారా నర్సంపేట మెయిన్రోడ్డు వైపు నుంచి వెళ్లాలని కోరారు. అలాగే, రెడ్డిపాలెం జంక్షన్ నుంచి వచ్చే వాహనదారులు గొర్రెకుంట మీదుగా వెళ్లాలని సూచించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.