ప్రకటించిన కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
హ్యాట్రిక్ సాధించిన జీడబ్ల్యూఎంసీ
కార్పొరేషన్ ప్రతిష్ట పెరిగింది : మేయర్ గుండు సుధారాణి
వరంగల్, జూలై 14 : బల్దియా సిగలో మరో కలికితురాయి చేరింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కేటగిరీలో గ్రేటర్ కార్పొరేషన్ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. ఈ మేరకు గురువారం కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతి ఏడాది నిర్వహించే పోటీలో వరుసగా గ్రేటర్ వరంగల్ మూడుసార్లు 2020, 2021, 2022వ సంవత్సరంలో ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రజా మరుగుదొడ్ల, మల వ్యర్థాల నిర్వహణలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన కేంద్రం ఈ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. గ్రేటర్ కార్పొరేషన్లో ప్రతి వెయ్యి మందికి ఒక సీటు చొప్పున ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో చేసిన కృషిని పరిగణలోకి తీసుకొని కేంద్రం గ్రేటర్కు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ ప్రకటించింది. రాష్ట్రం నుంచి 16 నగరాలకు ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు లభించింది.
బల్దియా ప్రతిష్ట పెరిగింది..
– గుండు సుధారాణి, మేయర్
కేంద్ర ప్రభుత్వ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు ఇవ్వడంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రతిష్ట పెరిగింది. ఇందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, సౌకర్యాల కల్పన, మురుగునీరు, మానవ మల వ్యర్థాల శుద్ధీకరణలో అవలబిస్తున్న విధానాలను కేంద్రం గుర్తించింది.
పోచమ్మ బోనాల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేయాలి..
ఈ నెల 29వ తేదీ నుంచి జరుగనున్న పోచమ్మ బోనాల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజారోగ్యం, ఇంజినీరింగ్, ఎలక్ట్రిక్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోచమ్మ బోనాల పండుగ నేపథ్యంలో పోచమ్మ దేవాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు బోనాలతో దేవాలయాలకు వచ్చే రహదారులను మరమ్మతులు చేయాలని సూచించారు. పోచమ్మ దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. శ్రావణ మాసం అంతా బోనాల పండుగ జరుగనున్న తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా ఉండాలన్నారు. సమీక్షా సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, ఈఈలు శ్రీనివాసరావు, బీఎల్ శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ ఈఈ లక్ష్మారెడ్డి, ఎంహెచ్వో రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.