హనుమకొండ/సుబేదారి, సెప్టెంబర్ 20 : హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి తాళం పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ఏడాది క్రితం సీఎం ఎనుముల రేవంత్రెడ్ది ప్రారంభించారు. కుడా ఆధీనంలో ఉన్న కాళోజీ ప్రారంభించి ఏడాదైనా నిర్మాణ పనులు చేపట్టిన మెస్సర్స్ బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్రెడ్డికి సుమారు రూ. 4కోట్లకు పైగా బిల్లులు రాకపోవడంతో శనివారం ప్రధాన గేట్లకు తాళం వేశారు. కాగా ఆదివారం నుంచి రెండు రోజుల పాటు కళాక్షేత్రంలో మొట్టమొదటిసారి జరుగనున్న కాకతీయ నృత్య నాటకోత్సవాల ఏర్పాట్ల కోసం అధికారులు చేరుకోగా తాళం గమనించిన అధికారులు కంగుతిన్నారు.
ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుడా ఉన్నతాధికారి అజిత్రెడ్డి కాంట్రాక్టర్ శ్రీకాంత్రెడ్డితో మాట్లడగా తాళం వేసింది తానే.. తనకు రూ. 4కోట్ల బిల్లు రావాల్సి ఉందని చెప్పాడు. తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెలించే వరకు తాళం తీసే ప్రసక్తి లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఇదే విషయాన్ని కుడా అధికారి అజిత్రెడ్డి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు సదరు కాంట్రాక్టర్తో మాట్లాడి రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే నృత్య నాటకోత్సవాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు హాజరు కానున్నారని, వేసిన తాళం తీయాలని, బిల్లుల విషయాన్ని అధికారులతో మాట్లాడుకోవాలని హుకుం జారీ చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు, కాంట్రాక్టర్కు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పాటు వాగ్వాదం జరిగింది. పెండింగ్ బిల్లుల విషయాన్ని అధికారులతో మాట్లాడుకోవాలి తప్ప తాళం వేయడం కరెక్ట్ కాదని హెచ్చరించి తాళాలు తీసారు. కాగా బిల్లులు సంగతి తేల్చకుండా అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంట్రాక్టర్ వాపోయారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సర్స్ బృందా ఇన్ప్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్పై కేసు నమోదు చేయాలని కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్పాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు.