ప్రభుత్వ దవాఖానాల్లోనే ప్రసూతి కావాలి
నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
అనవసరపు సిజేరియన్లను నివారించాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఎర్రబెల్లి ట్రస్టు సహకారంతో వీఎంఎఫ్ సామూహిక సీమంతోత్సవం
150 మంది గర్భిణులకు చీరె, సారెతో సత్కారం
తొర్రూరు, జూన్ 23: మాతృత్వం.. తియ్యని మమకారం.. దాన్ని విచారకరం చేసుకోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. అనవసర ఆపరేషన్లు చేయించుకోవద్దని, ప్రభుత్వ దవాఖానల్లో సుఖ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సహకారంతో వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో గురువారం సామూహిక సీమంతోత్సవం నిర్వహించారు. 150 మంది గర్భిణులను చీరెసారెలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సృష్టిలో మాతృత్వానికి విలువు, ఎనలేని మమకారం ఉందని, అందుకే ఈ సృష్టి ఇలా కొనసాగుతూ ఉన్నదన్నారు. వెనకటికి మంత్రసానులు ప్రసవాలు చేసే వారని, మారిన ఆధునిక కాలంతో పాటు ప్రసవాలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఇప్పుడన్నీ సెక్షన్, సిజేరియన్ అంటున్నారని, దీని వల్ల చిన్న వయసులోనే తల్లులైన వారంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అందుకే గర్భిణులు కచ్చితంగా నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యమివ్వాలన్నారు. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి కొన్ని సమావేశాల్లో పాల్గొనగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులే ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నట్లు డాక్టర్లు తమ దృష్టికి తెచ్చారని, ధైర్యం చేసి వైద్యం చేస్తే వికటించిన సందర్భాల్లో దవాఖానలపై దాడులు జరుగుతున్నాయన్నారు.
ఈ విషయంలో ప్రజలే చైతన్యమవ్వాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణులు సైతం కొన్ని బాధలు భరించైనా నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. కలెక్టర్ కే శశాంక మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవ్వాలంటే గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ప్రతి బిడ్డకు ఆదిగురువు అమ్మేనని, మొదటి బడి అమ్మఒడి అన్నారు. జిల్లాలో 75శాతం సిజేరియన్లు తగ్గించామన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్రావు మాట్లాడుతూ.. మాతృత్వం ఎంత సంతృప్తిని ఇస్తుందో జాగ్రత్తలు తీసుకోకపోతే అంతటి నరకాన్ని చూపిస్తుందని అన్నారు. గర్భిణిలు పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యుల సలహాలను పాటించి, ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వాలన్నారు. తద్వారా ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర విద్యతోపాటు ఆరోగ్య సమాజం కోసం ఈ తరహా కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారని, వీరికి ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుందని ప్రకటించారు. ట్రస్ట్తోపాటు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి ఎలెక్ట్ అధ్యక్షురాలు వజినపల్లి దీప, రోజ, గ్రీన్ఫర్ రెవల్యూషన్ వ్యవస్థాపకురాలు లీలాలక్ష్మారెడ్డితోపాటు మరికొంత మంది ఉదారంగా ముందుకు వచ్చి సామూహిక సీమంత కార్యక్రమానికి సహకరించారు.
అనంతరం చిన్నారులతో కలెక్టర్ శశాంక, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉష అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎల్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, డీడబ్ల్యూవో స్వర్ణలత లెనినా, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ ఎస్ నాగవాణి, ఏసీడీపీవో ఇందిరమ్మ, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, వైస్ ఎంపీపీ ఇట్టే శ్యాంసుందర్రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్కే అంకూస్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, గుండాల నర్సయ్య, సర్పంచులు, కౌన్సిలర్లు, వీఎంఎఫ్ కార్యకర్తలు దర్గయ్య, మహేందర్, బ్రహ్మచారి పాల్గొన్నారు.