చౌరస్తా, జనవరి 10: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్రే మిషన్ పనిచేయక వారం గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేస్తునన్నారు. ఈ నెల మూడో తేదీ తెల్లవారుజామున ఎక్స్రే మిషన్ మొరాయించడంతో సేవలు నిలిచిపోయాయి. అత్యవసర చికిత్స పొందుతున్న రోగులను స్ట్రెచర్పై రేడియాలజీ విభాగానికి తరలించాల్సి వస్తున్నా మరమ్మతుల విషయంలో అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాల్లో గాయపడిన వారి ఎముకల స్థితిని తెలుసుకునేందుకు ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. అయితే, అత్యవసర విభాగంలో అందుబాటులో లేకపోవడంతో రోగులతోపాటు వైద్య సిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చాలాకాలంగా బయోకెమిస్ట్రీ ల్యాబ్లో మూత్రపిండాల పనితీరును పరీక్షించే రెనల్ ఫంక్షన్ టెస్ట్లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వంద వరకు నిర్వహించే ఈ పరీక్షలు నెల రోజులుగా రసాయనాలు అందుబాటులో లేకపోవడం వల్ల నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో సీరం క్రియాటిన్, బ్లడ్ యూరియా పరీక్షలు కొనసాగడం లేదని పలువురు ఎంజీఎం ఉద్యోగులు, సిబ్బంది సైతం బహిరంగంగానే చెబుతున్నారు. అయితే వైద్య సేవల్లో ఎలాంటి ఆటంకాలు లేవని, అన్ని రకాల రసాయనాలు అందుబాటులోనే ఉన్నాయని ఇటీవల డిసెంబర్ 31న జరిగిన సమీక్షలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలియజేయడంతోపాటు భవిష్యత్లో ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు అందుకు తగిన విధంగా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్య సేవలు నిరాటంకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రోగులు, అటెండెంట్లు కోరుతున్నారు.