జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై కాంగ్రెస్ కపట ప్రేమ కనబరుస్తున్నదని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం భూపాలపల్లి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్ వేయగా మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా కొంత మంది నాయకులు, కార్యకర్తలతోనే నామినేషన్ వేస్తానని ఎమ్మెల్యే గండ్ర ప్రకటించినప్పటికీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరాగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి రిటర్నింగ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌక్లో జరిగిన ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ఆరు హామీలతో కాంగ్రెస్ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నదని, ఈ హామీలు కేవలం తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు చేయని హామీలను తెలంగాణలోనే అమలు చేస్తారా? కాంగ్రెస్ రాష్ట్ర పార్టీనా.. జాతీయ పార్టీనా.. సిగ్గు, శరం ఉందా… అని మండిపడ్డారు. భూపాలపల్లిలో సిరికొండ మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణారెడ్డి కలిస్తే అభివృద్ధికి అడ్డు ఉండదన్నారు. సిరికొండ మధుసూదనాచారి సీఎం కేసీఆర్కు కుడి భుజం అన్నారు. తొలి శాసనసభాపతిగా శాసనసభకు వన్నె తెచ్చాడని, ఎమ్మెల్యేగా భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపించగా అనంతరం రమణారెడ్డి మరింత ముందుకు తీసుకుపోయారన్నారు. సీఎం కేసీఆర్ భూపాలపల్లిపై ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నారని, ఈ జిల్లాకు తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారన్నారు.
మధుసూదనాచారి నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తలు, రమణారెడ్డి నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తలు ఇరువురు నా రెండు కళ్లు అని, వారిని కంటికి రెప్పలా చూ సుకుంటానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికలు భూపాలపల్లి భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవి అన్నారు. మన రాష్ట్ర పథకాలను స్టడీ చేసి ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణీ రాకేశ్, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సహకారంతో అభివృద్ధి
– ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
భూపాలపల్లి అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారని, ఈ క్రమంలోనే భూపాలపల్లి రూపురేఖలు మారాయని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మూడో సారి సీఎం కావడం ఖాయమన్నారు. ఆయన వాక్కు నాకు వేద వాక్కు అన్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇద్దామన్నారు. తాను ఎమ్మెల్యే, స్పీకర్గా భూపాలపల్లిని అభివృద్ధిలో అగ్రభాగంలో నిలిపానని, అది నా గొప్పతనం కాదని, సీఎం కేసీఆర్ సహకారమేనన్నారు. భూపాలపల్లిలో మన అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ సీఎం అవుతారని, ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మనందరి లక్ష్యం కేసీఆర్ సీఎం కావడమనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ 20 రోజులు ఎన్నికలను సీరియస్గా తీసుకుని పనిచేసి సీఎం విశ్వాసాన్ని చూరగొందామన్నారు. భూపాలపల్లి అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఉంటుందని, నా జీవితం బీఆర్ఎస్కే అంకితమని, నా శక్తి భూపాలపల్లికే అంకితమని అన్నారు.