స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 19 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బుధవారం స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో బెలిదె వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు రూ.33,03,700 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి కడియం శ్రీహరి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే విమర్శలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే పార్లమెంట్ నడుస్తున్నదనే విషయాన్ని గ్రహించడంలేదన్నారు. అంబేద్కర్కు బీజేపీ ఘన నివాళులర్పించాలనుకుంటే పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మహనీయుడు చూపిన మార్గంలో పయనించాలని, అంబేద్కర్లా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలని హితవు పలికారు. దళితులు ఆత్మన్యూనత భావాన్ని వీడి ఆత్మాభిమానంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర సచివాలయానికి కూడా రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడడం గర్వకారణమన్నారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కడియం శ్రీహరి వివరించారు. దేశంలో ఎవరికీ రాని ఆలోచన కేసీఆర్కు రావడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే సుమారు 40 వేల కుటుంబాలకు దళితబంధు ఆర్థిక సాయం అందిందన్నారు. ఈ సంవత్సరం లక్షా 30 వేల కుటుంబాలకు సాయం లభిస్తుందని, ఇందుకోసం రూ.17,700 కోట్లను బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణలో 17.50 లక్షల దళిత కుటుంబాలున్నాయని, విడుతల వారీగా ప్రతి కుటుంబానికి దళితబంధు అందించి వారిని ఆదుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని వెల్లడించారు.
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలు
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, కులవృత్తులను సైతం ఆదుకుంటున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో 1001 గురుకుల పాఠశాలల ద్వారా సుమారు ఆరు లక్షల మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడమే కాకుండా విదేశాల్లో చదువుకునే వారికి రూ.20 లక్షలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం, విద్య, సంక్షేమం, ఆరోగ్యం శాఖలకు సాలినా రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ఇంత చేస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అం దుకే కేసీఆర్ను విపక్షాలు టార్గెట్ చేస్తూ తెలంగాణాకే పరిమితం చేయాలని కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతుగా ఉండాలని కోరారు.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ఆనందకరం
అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ చైర్మన్గా తనను సీఎం కేసీఆర్ నియమించారని కడియం శ్రీహరి తెలిపారు. 14 ఏప్రిల్ 2016లో శంకుస్థాపన చేశారన్నారు. రూ.145 కోట్లతో 125 అడుగుల విగ్రహ ఏర్పాటుతోపాటు అంబేద్కర్ ఛాయాచిత్రాలతో గదిని, గ్రంథాలయం, మ్యూజియంను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-2 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కడి యం శ్రీహరి తెలిపారు. జనగామలో మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నా రు. దీంతోపాటు టీచింగ్ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, రాజేశ్ నాయక్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, స్టేషన్ ఘన్పూర్, ధర్మసాగర్, చిల్పూరు, జఫర్గఢ్ మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పోగుల సారంగపాణి, పెసరు రమేశ్, లింగారెడ్డి, సంపత్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, సొసైటీ చైర్మన్ తీగల కరుణాకర్రావు, సర్పంచ్లు మణెమ్మాయాదగిరి, ఎర్రబెలి శరత్కుమార్, బూర్ల శంకర్, నాగరాజు, జనగామ యాదగిరి, సీనియర్ నాయకుడు తాళ్లపల్లి వెంకటయ్య, జీడి ప్రసాద్, కడియం యువసేన అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు, మాజీ సర్పంచ్లు పేరాల సుధాకర్, ప్రభాకర్, అశోక్ పాల్గొన్నారు.