హనుమకొండ, ఫిబ్రవరి 26 : రాష్ట్ర వ్యాప్తంగా జరిగి న ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించగా బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహా శబరీష్ను మహబూబాబాద్కు బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న అద్వైత్కుమార్ సింగ్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న చాహత్ బాజ్పాయ్కు హనుమకొండ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు.
అలాగే జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా ను జోగులాంబ గద్వాల కలెక్టర్గా బదిలీ చేయగా, అతడి స్థానంలో జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న సందీప్కుమార్ ఝా నియమించారు. అలాగే ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రామిష్రాను కరీంనగర్ కలెక్టర్గా బదిలీ చేయగా, ఆమె స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ (కన్ఫర్డ్ ఐఏఎస్)ను వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా పోస్టింగ్ ఇచ్చారు. జనగామ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్మార్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా బదిలీ అయ్యారు.