నెల్లికుదురు, నవంబర్ 8 : బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహం అందిస్తున్నది. ఈమేరకు ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్న 30వ ‘జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్’ పోటీల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందుకుగాను సైన్స్టీచర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వగా బాలలు విధిగా పాల్గొని వివిధ ప్రాజెక్టులు రూపకల్పన చేసే బాధ్యతనూ వారికి అప్పగించింది. మొత్తం 9 అంశాలకు 100 మార్కులు కేటాయించగా.. ఈ ఏడాది ‘ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’ ప్రధాన అంశంగా నిర్ణయించింది.
విద్యార్థులకు విజ్ఞానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా ఆవిష్కరణలు చేసి ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు నిర్వహించకపోగా.. మళ్లీ ఈ ఏడాది వివిధ ప్రాజెక్టులతో నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. ఈ నెల చివరి వారంలో జిల్లాస్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో భారీ సంఖ్యలో పాఠశాలలు దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం ఈ నెల 3న జిల్లాకేంద్రంలోని హోలీ ఎంజెల్స్ హైస్కూల్లో మండల విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లానుంచి జాతీయ స్థాయి వరకు ప్రాజెక్టుల రూకల్పన చేసి పోటీపడే అవకాశం ఉంటుంది.
9 అంశాలు.. 100 మార్కులు
జిల్లాస్థాయిలో తొమ్మిది అంశాలకు 100 మార్కులు ఇవ్వనున్నారు. సరికొత్త ఆలోచన, భావన అంశానికి 10 మార్కులు, ఎంచుకున్న అంశం ప్రధానాంశానికి సరిపోతే 10 మార్కులు, సమస్య గురించి అవగాహనపై 15 మార్కులు, దత్తాంశ సేకరణ- విశ్లేషణకు 15 మార్కులు, ప్రయోగాలు-నిర్ధారణలకు 10 మార్కులు, సమస్య పరిష్కారం కోసం కృషికి 10 మార్కులు, జట్టు పని-సమన్వయానికి 10 మార్కులు, విద్యార్థి నేపథ్యానికి 10 మార్కులు, వ్యక్తీకరణకు 10 మార్కులు ఇలా మొత్తం 100 మార్కులు కేటాయించారు.
ఆర్యోగ సంక్షేమమే ప్రధానాంశంగా..
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు 1993 నుంచి జాతీయ శాస్త్ర సాంకేతిక సమాచార మండలి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ‘ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’ అనే అంశాన్ని ప్రధానాంశంగా నిర్ణయించారు.
సైన్స్ టీచర్లు ప్రత్యేక చొరవ చూపాలి
30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా సైన్స్ టీచర్లు ప్రత్యేక చొరవ చూపాలి. ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా విద్యార్థులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చూడాలి. తద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగి సరికొత్త ఆవిష్కరణలకు పునాది పడుతుంది. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికతను పెంపొందించేందకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత హెచ్ఎంలదే.
– అప్పారావు, జిల్లా సైన్స్ అధికారి,
మహబూబాబాద్ జిల్లా
విద్యార్థులను సన్నద్ధం చేయాలి
జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సిద్ధం చేయాలి. విద్యార్థుల్లో విజ్ఞానం పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఈ నెల 3న జిల్లాకేంద్రంలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, సైన్స్ టీచర్లకు శిక్షణ ఇచ్చాం. 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గోనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి అప్పారావు(9849598281)ని సంప్రదించాలి.
– అబ్దుల్హై, డీఈవో, మహబూబాబాద్ జిల్లా
ఉప అంశాలు
బాలల సైన్స్ కాంగ్రెస్ లక్ష్యాలివీ..