పాదయాత్ర పేరుతో వైఎస్ షర్మిల డ్రామాలాడుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆమె పాదయాత్ర.. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆడిస్తున్న ఓ నాటకం అని ఆయన ఆరోపించారు. హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడారు. షర్మిల ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భాష మార్చుకోకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం, ఏపీ సృష్టిస్తున్న అడ్డంకులపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని, ఇక్కడ ఆంధ్ర నాయకుల పాలన మళ్లీ అవసరం లేదని పేర్కొన్నారు.
వరంగల్, డిసెంబర్ 3 : షర్మిల ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో ఓటు వేసి, తెలంగాణలో రాజకీయం చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆమె పాదయాత్ర.. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆడిస్తున్న డ్రామా అని ఆయన అభివర్ణించారు. షర్మిల పాదయాత్రలో వాడిన భాష, మాటలను ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తామన్నారు. హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులపై ఆయన షర్మిలకు సూటి ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులపై సమాధానం చెప్పాలని ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసి, అక్కడే ఓటు వేసిన షర్మిల ఇప్పుడు తెలంగాణ బిడ్డ అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.
8 ఏండ్ల తర్వాత గుర్తుకొచ్చిందా?
రాష్ట్రం వచ్చిన 8 ఏండ్ల తర్వాత షర్మిలకు తెలంగాణ బిడ్డ అని గుర్తుకు వచ్చిందని పెద్ది ఎద్దేవా చేశారు. చెల్లె తెలంగాణ బిడ్డ, అన్న జగన్ ఆంధ్ర బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన పరిమితుల మేరకు పాదయాత్ర చేసుకోవచ్చు, అతిక్రమించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దెబ్బలు తగిలినట్టు డ్రామా ఆడారని విమర్శించారు. అరగంటలో గాయం మాయం కావడంపై గవర్నర్ తమిళిసై సైతం చివాట్లు పెట్టారని పేర్కొన్నారు.
మీ పాలన తెలంగాణకు వద్దు..
రాజన్న రాజ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని ఎమ్మెల్యే పెద్ది గుర్తుచేశారు. వలస పాలకుల మెడ లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, మళ్లీ మీ పాలన తెలంగాణకు కావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకి వైఎస్ పేరుతో పెట్టిన పార్టీతో ఇక్కడ రాజకీయం చేస్తే ఆత్మాభిమానం కలిగిన తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ బిడ్డలే పాలించుకోవాలన్నారు. తెలంగాణలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారని, ఆంధ్ర నాయకుల పాలన మళ్లీ అవసరం లేదని వివరించారు.
ఒక మాటంటే మేం వంద మాటలు అంటం..
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని వివరించారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ఉద్యమ కారులపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని పెద్ది స్పష్టం చేశారు. నువ్వు ఒక మాట అంటే మేం వంద మాటలు అంటామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతు విమోచన కమిషన్ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
వైఎస్ షర్మిలకు పెద్ది బహిరంగ లేఖ
వైఎస్ షర్మిలకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్రం నిధుల మంజూరులో వివక్షపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నలు వేశారు. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ తెలంగాణలో చేస్తున్న పాదయాత్రలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బహిరంగ లేఖలో ప్రశ్నలు ఇవి..