న్యూఢిల్లీ, జూలై 21: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరోసారి ధరలను పెంచేసింది. ఆగస్టు నెల నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను రూ.30 వేల వరకు సవరిస్తున్నట్టు ప్రకటించింది. నిరంతరంగా ఉత్పత్తి వ్యయం పెరుగడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా కొనుగోలుదారులపై భారం మోపాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెరుగనున్న ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. గత కొన్ని నెలలుగా ధరలను తగ్గించాలని చూస్తున్నప్పటికీ మరోవైపు ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయం పెరుగడంతోపాటు ద్రవ్యోల్బణం కారణంగా తప్పనిపరిస్థితుల్లో ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థ రూ.3.5 లక్షలు మొదలుకొని రూ.28.70 లక్షల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.