ఖానాపురం, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే పాకాల ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మొదట నాజీతండాలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రామప్ప రిజర్వాయర్ నుంచి పాకాల సరస్సులోకి తరలివస్తున్న గోదావరి జలాలను కీర్యతండా శివారు దబ్బావాగు వద్ద ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకాల ఆయకట్టు చరిత్రలో ఎన్నడు లేని విధంగా యాసంగిలో పూర్తిస్థాయి సాగుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ప్రాజెక్టు అధికారికంగా పూర్తికానప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అనుమతులు తీసుకుని నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రంగాయ చెరువు నుంచి మోటర్ల ద్వారా ప్రతి రోజూ 15 ఎంసీఎఫ్టీ నీటిని పాకాలలోకి తరలిస్తున్నామన్నారు. మరి కొద్ది రోజుల్లో పాకాలలో మోటర్లను ప్రారంభిస్తామని, రోజూ 40 ఎంసీఎఫ్టీ నీటిని విడుదల చేస్తామన్నారు. ధర్మారావుపేట, బాలుతండా, కొత్తూరు, రంగాపురం శివారులోని చివరి ఆయకట్టు రైతులు ఇకపై పంటలు పండిచ్చుకోవచ్చన్నారు.
పాకాల ప్రాజెక్టుపై కొందరు ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, నీళ్లు రానే రావన్న వారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓడినా ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. ఆ సమయంలోనే ప్రాజెక్టుకు రూపకల్పన చేశానన్నారు. కానీ ఇప్పుడు కొందరు నాయకులు ఓడిపోయి ఇంట్లో కూర్చుని ఎన్నికలు సమీపిస్తుంటే మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని, విజన్లేని నాయకులతో ఈ ప్రాంతానికి ఒరిగేది ఏమి లేదని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అనేక మార్లు గెలిచిన నాయకులు పాకాలకు శాశ్వత జలవనరులు కల్పించి ఉంటే ఇప్పటికే రైతులు రెండు పంటలు పండించుకుని ఆర్థికంగా ఎదిగేవాళ్లు అని అన్నారు. గోదావరి జలాల రాకతో ఈ ప్రాంతంలోని భూముల రేట్లు పెరుగుతున్నాయని చెపారు.
మంగళవారిపేట పరిధిలోని గిరిజన రైతులకు పోడు పట్టాలు అందించాకే ఓట్లు అడుగుతానని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. గతంలో పాలించిన నాయకులు ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోయారో చెప్పాలన్నారు. ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. నాజీతండాకు సీసీ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రెండు నెలల్లో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, ఇంటి స్థలాలు ఉన్న వారికి రూ.3 లక్షలు ఇస్తుందని స్పష్టం చేశారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, వేజళ్ల కిషన్రావు, సర్పంచ్ బాలకిషన్, సుమన్, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్, మండల వైద్యాధికారి భూపేశ్, రామసహాయం ఉపేందర్రెడ్డి, బందారపు శ్రీను, వల్లెపు శ్రీను, బూస అశోక్, పూర్ణచందర్రావు, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.