నెక్కొండ, మార్చి 5: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడమే అందరి లక్ష్యం కావాలని, సమన్వయంతో ముందుకెళ్లి ముఖ్యమంత్రిని మరోసారి ఆశీర్వదించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మండలంలోని దీక్షకుంటలో శనివారం దీక్షకుంట, చంద్రుగొండ, గొల్లపల్లి, మూడుతండా, బంజరుపల్లి, వాగ్యానాయక్తండా, ముదిగొండ, హరిచంద్తండా, సీతారాంపురం, దేవునితండా, పనికర గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్న ప్రతిపక్షాలు నాలుగేళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఇంటి గేట్ తెరువని ప్రతిపక్ష నాయకులు ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి ఖద్దరు చొక్కాలు వేసుకొని ఊర్లబాట పట్టారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతిపల్లెలో స్పష్టమైన అభివృద్ధి దర్శనమిస్తున్నదని స్పష్టం చేశారు. దీనిపై గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పల్లెలో సీసీరోడ్లు, ప్రతి తండా, గ్రామానికి లింక్రోడ్లు, పుష్కలంగా సాగునీరు, రక్షిత మంచినీరు అదించడంతోపాటు రైతన్నలకు 24 గంటల ఉచిత కరెంట్ను బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్నదని గుర్తు చేశారు.
ప్రతి రంగంలో అభివృద్ధి మార్క్
ప్రతి రంగంలో అభివృద్ధి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పల్లె గులాబీమయం కావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలకు కాలం చెల్లిందని విమర్శించారు. నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్సంబంధాలను కొనసాగించాలని, ఎప్పటికప్పుడూ నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు భరోసా ఇవ్వాలి..
ప్రజలకు ఏ కష్టమొచ్చినా బీఆర్ఎస్ భరోసా ఇచ్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పెద్ది అన్నారు. క్షేత్రస్థాయిలోనే ప్రతిపక్షాలకు తగిన సమాధానం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీపీ లావుడ్యా సరోనా హరికిషన్, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, సర్పంచ్ ఆలకుంట సురేందర్, మండల నాయకులు కట్కూరి నరేందర్రెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, సారంగపాణి, కొమ్ము రమేశ్యాదవ్, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్లస్టర్, గ్రామ బాధ్యులు పాల్గొన్నారు.