పాట్నా: బీహార్లోని ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ప్రముఖ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు. (RJD Spokesperson Joins BJP) చాలా ఏళ్లుగా వార్తా ఛానళ్లలో ఆర్జేడీ తరపున గళం వినిపించిన మృత్యుంజయ్ తివారీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరౌగి ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ‘ఆయన ఎప్పుడూ నిజాయితీతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయనకు సరైన వేదిక, నిజమైన నివాసం దొరికింది’ అని అన్నారు. తివారీ రాకతో బీజేపీ మరింత బలోపేతమవుతుందని ఇతర నాయకులు పేర్కొన్నారు.
కాగా, జూలై 16న మృత్యుంజయ్ తివారీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ 2014లో తనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినట్లు తెలిపారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీడియాలో సమర్థించడంలో తాను శాయశక్తులా కృషి చేసినట్లు చెప్పారు.
అయితే లాలూ క్రియాశీలక దశ తర్వాత ఆయన వారసుడైన తేజస్వి యాదవ్తో పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనపై చర్చించినట్లు మృత్యుంజయ్ తివారీ తెలిపారు. ఆయన చుట్టూ చేర్చుకున్న వ్యక్తులు ‘చెదపురుగుల్లా పార్టీని లోపలి నుంచి తినివేస్తూ బలహీనపరుస్తున్నట్లు’ తనకు అర్థమైందని చెప్పారు. ‘పార్టీలో ‘ఊపిరి ఆడని పరిస్థితి’ నెలకొన్నది. అందుకే ఆర్జేడీకి రాజీనామా చేస్తున్నా’ అని ఆ వీడియోలో ప్రకటించారు.