తాండూర్ : బాధితుల ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం ( Justice) అందేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ( CP Amber Kishore Jha ) పోలీసు అధికారులను ఆదేశించారు. తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తో కలిసి శుక్రవారం తనిఖీ నిర్వహించారు. కార్యాలయ పనితీరు, రికార్డుల నిర్వహణ, పోలీసు సేవల అమలును సమీక్షించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీస్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలకు అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించి వారి సమస్యలను వినాలని అన్నారు. క్రింది స్థాయి అధికారులకు కూడా ప్రజలకు సకాలంలో సహాయం అందించేలా మార్గనిర్దేశం చేయాలని చెప్పారు.
స్థానిక రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు తమ సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సీఐ దేవయ్య, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.