నల్లబెల్లి, అక్టోబర్ 18: గత పాలకుల హయాంలో కనీస సౌకర్యాలకు నోచుకోని నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దానని, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని బోల్లోనిపల్లె, శనిగరం గ్రామాల నుంచి 150 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి రాజీనామా చేసి బుధవారం పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. బోల్లోనిపల్లెలో సర్పంచ్ తిప్పని సృజన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష వైఖరితో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆశీర్వాదంతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. కేవలం నాలుగున్నరేళ్లలోనే డివిజన్ రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కువ శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు సాగునీరందించి సస్యశ్యామలం చేశానన్నారు. ఒకప్పుడు గుక్కెడు తాగు నీటికి అల్లాడిపోయిన ప్రజలకు సీఎం కేసీఆర్ సహకారంతో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూనే విద్య, వైద్యాన్ని నియోజకవర్గంలోని పేదప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో మెడికల్ కాలేజీ మంజూరు చేయించి, ఏటా వందమంది డాక్టర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రధానంగా మండలంలోని కన్నారావుపేట 58 సర్వే నంబర్లో 45 ఎకరాల స్థలంలో హర్ట్టికల్చర్ రీసోర్స్ సెంటర్ను మంజూరు చేయించినట్లు వెల్లడించారు. దీంతో రైతులకు మరింత మేలు జరుగనుందన్నారు. ప్రతి గ్రామానికి వందశాతం సీసీ, తారు రోడ్లు నిర్మించినట్లు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వర్రావు, ఎంపీటీసీ బోల్ల శ్రీలత, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, కొత్తపెల్లి కోటిలింగాచారి, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్గుప్తా, ఇంగ్లి శివాజీ, తంగెల్ల రవీందర్రెడ్డి, భట్టు సాంబయ్య, ఆకుల సాంబరావు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తిప్పని రవీందర్, జనగాం నాగేశ్వర్రావు, నూనె చిరంజీవి, జక్క అశోక్, నీలం సుమన్, రవి, మాదాసు రాజు, గంగారపు అనిల్తోపాటు మరో 150 కుటుంబాలు ఉన్నాయి.
ఖానాపురం: మండలంలోని దబీర్పేటకు చెందిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు గాదెం చిన్న రాజాలు మండలకేంద్రంలో బీఆర్ఎస్లో చేరాడు. ఈ సందర్భంగా అతడికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ లేదన్నారు. తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై స్వచ్ఛందంగా చాలామంది బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, బత్తిని శ్రీనివాస్గౌడ్, రాజు, సొసైటీ డైరెక్టర్ రవీందర్రావు, ఎంపీటీసీ శంకర్, వేణుకృష్ణ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అక్కల్చెడలో రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పెద్ది హాజరై మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశానని, మరో అవకాశం కల్పిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు. అక్కల్చెడ గ్రామంలో రూ. 4 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ రాష్ట్ర నాయకులు, మండల ఎన్నికల ఇన్చార్జి రాయుడి రవీందర్రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, సీనియర్ నాయకులు బాల్నె వెంకన్న, యూత్ మండలాధ్యక్షుడు కృష్ణచైతన్య, నాయకులు బద్దూనాయక్, అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, చెన్నారావుపేట సర్పంచ్ కే మల్లయ్య పాల్గొన్నారు.