హనుమకొండ సబర్బన్, మే 23 : పంట దిగుబడి గణనీయంగా పెరుగాలన్నా, ఉత్పత్తులు నాణ్యంగా రావాలన్నా గుళికల రూపంలో ఉన్న డీఏపీ(డై-అమోనియం ఫాస్ఫేట్)నే అందరూ వాడుతారు. ప్రస్తుతం రైతులు మోతాదుకు మించి వీటిని కుమ్మరించడం వల్ల నేలలో భాస్వరం నిల్వలు పెరుగడంతో పాటు నీరు, వాయుకాలుష్యం ఎక్కువై అనర్థాలకు దారితీస్తోంది. ఈ పరిణామాలతో రంగంలోకి దిగిన ప్రఖ్యాత ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో పలు పరిశోధనల తర్వాత ద్రవరూపంలో డీఏపీని అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్తాల బాధ తప్పించి జేబులో పెట్టుకొని తీసుకెళ్లేలా రూపొందిన ఈ ‘నానో డీఏపీ’ బాటిల్స్ వల్ల రైతులకు ఖర్చు తగ్గడమే గాక ఆర్థికంగా లాభం చేకూరనున్నది.
పనితీరు ఇలా..
గుళికల కంటే ద్రవరూప డీఏపీ వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయి. ఎరువుల దుకాణంలో బస్తాలను కొనుక్కుని పంట క్షేత్రానికి తరలించాలంటే తలకు మించిన భారమవుతుంది. తప్పని సరిగా వాహనం ఉంటేనే బస్తాలను తీసుకెళ్లడం వీలవుతుంది. పొలాల వద్దకు దారి లేని రైతులకైతే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అదే నానో డీఏపీని చాలా సులువుగా జేబులో పెట్టుకొని కూడా పంట వద్దకు తీసుకెళ్లి పిచికారీ చేసుకోవచ్చు. ఎలాంటి పర్యావరణ సమస్యలుండవు. చేనులో నేరుగా ఆకులపై పడి తొందరగా పనిచేస్తుంది. గుళికల బస్తా పని చేయాలంటే 10 నుంచి 12రోజుల సమయం పడుతుంది.
అదే ద్రవరూప డీఏపీ అయితే కేవలం 3 నుంచి 5 రోజుల్లో తన పనిని ప్రారంభిస్తుంది. ఈ ద్రవరూప డీఏపీలో 8శాతం నత్రజని, 16శాతం భాస్వరం మిళితమై ఉంటుం ది. 100 నానోమీటర్ కంటే తక్కువ ఘనపరిమాణం ఉండడం వల్ల పంటలకు మంచి పోషకాలు త్వర గా అందుతాయి. దీని వల్ల పంట నాణ్యత, దిగుబడి కూడా పెరుగుతుంది. 90శాతం మందు పంటపైనే పనిచేస్తుంది. ఒక డీఏపీ బస్తాకు సమానంగా పనిచేసేటువంటి 500 మిల్లీలీటర్ల డీఏపీ బాటిల్ ధర రూ.600 ఉంది. అంటే రైతులకు ఒక్కో బస్తాపై రూ.800 మిగులుతాయి. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో ఇఫ్కో సంస్థ నానో జింక్ ను, నానో కాపర్ను కూడా ద్రవరూపంలో తీసుకురానున్నది.
గతేడాది యూరియా.. ఇప్పుడు డీఏపీ
పంట పొలాల్లో నత్రజని పాత్రను కూడా ఏమా త్రం తక్కువ చేయలేం. పంటల ఎదుగుదల, పచ్చదనం విషయంలో యూరియా బాగా పనిచేస్తుంది. అయితే యూరియాను కూడా ఇఫ్కో సంస్థ గతేడాది ద్రవరూపంలో తీసుకొచ్చింది. రైతులు కూడా వాడి బస్తాలో ని యూరియాకు సమానంగా లిక్విడ్ యూరి యా పనిచేసినట్లు గుర్తించారు. దీనికి తోడు ఇప్పుడు ద్రవ రూపంలోనె డీఏపీని ఇఫ్కో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ఢిల్లీలోని ఇఫ్కో హౌస్లో ఆవిష్కరించిన ఈ నానో డీఏపీని మన రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేశారు. గుజరాత్లోని కలోల్, కాండ్లతో పాటు ఒడిశాలోని పారాదీప్ల్లో మొత్తం మూడు లిక్విడ్ డీఏపీ తయారీ కోసం భారీ ప్లాంట్ల ను ఇఫ్కో ఏర్పాటుచేసింది. ఇప్పటికే కలోల్ ప్లాంట్లో 25లక్షల టన్నుల గుళికల డీఏపీకి స మానంగా 5 కోట్ల ద్రవరూప బాటిళ్లను తయారు చేసి మార్కెట్లలోకి విడుదల చేశారు. 2025-26 నాటికి కంపెనీకి చెందిన 3 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చి ఏటా 18 కోట్ల డీఏపీ బాటిళ్లను తయారుచేయాలని ఇఫ్కో లక్ష్యంగా పెట్టుకున్నది.
రైతులకు ఎంతో మేలు..
నానో ఎరువుల వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ఖర్చు తగ్గడంతో పాటు రవాణా భారం కూడా తగ్గుతుంది. గతేడాది అందుబాటులోకి వచ్చిన నానో యూరియా పనితీరు బాగానే ఉన్నట్లుగా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఇఫ్కో తెచ్చిన నానో డీఏపీ కూడా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాం. పాడైపోతున్న పర్యావరణాన్ని ఈ నానో ఎరువుల వల్ల కొంతమేర కాపాడిన వారమవుతాం. వ్యవసాయంలో వస్తున్న మార్పులను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకొని పాటించాలి.
– దామోదర్రెడ్డి, ఏడీఏ, హనుమకొండ