ములుగు : రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పారిశుధ్య మెరుగుకు ప్రత్యేక డ్రైవ్ (Special sanitation drive ) ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఈనెల 7 నుంచి 15వ తేదీవరకు గ్రామాల్లో పారిశుధ్య డ్రైవ్ను నిర్వహిస్తుంది. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seetakka) గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనపై పలు సూచనలు చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్లో ప్రజలను, యువతను, మహిళలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దంలా తయారు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లను శుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం(Plastic Ban)పై ప్రజలందరిని భాగస్వామి చేస్తూ అవగాహన కల్పించాలని, మధ్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వచ్చే నష్టాలపై అవగాహన సైతం కల్పించాలని సూచించారు.
చివరి రోజున గ్రామసభ నిర్వహించాలని, పారిశుద్ధ కార్మికులకు సన్మానించాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెక్తకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని కోరారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించుకొని, గ్రామ పంచాయతీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
త్రాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలు నిధులు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.