ములుగు : దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గిరిజన విశ్వవిద్యాలయం (Tribal University) ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని శనివారం అధికారులు పరిశీలించారు. హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి వచ్చిన రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్, బి.జె.రావు, ఉప కులపతి అభిషేక్ కుమార్ కు ఐటీడీ ఏపీవో అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్ ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం పక్కన కేటాయించిన ప్రభుత్వ భూమిని చూపించి వివరాలు అందజేశారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఛాంబర్లో సమావేశమై యూనివర్సిటీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలం జాకారంలోని వైటీసీ భవనాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ కల్యాణ్ రెడ్డి, డీటీడీఓ దేశీరామ్, తహసీల్దార్ విజయభాస్కర్ సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.