ములుగు, ఫిబ్రవరి6(నమస్తేతెలంగాణ): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు యేటా భక్తుల సంఖ్య పెరుగుతున్నది. ఇందుకనుగుణంగా సకల సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు జాతర మార్గాల్లో భారీ వాహనాలను మళ్లించనున్నది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ నుంచి భూపాలపట్నం మార్గంలో ములుగు జిల్లా చివరి వరకు వీటిని నిలిపివేయనుంది. కేవలం భక్తులు, స్థానికుల వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అనుమతించనుంది. ఈ మార్గంలో వచ్చే వాహనాలు చర్ల-కొత్త గూడెం-ఖమ్మం-సూర్యాపేట-హైదరాబాద్, మణుగూరు-కొత్తగూడెం-ఖమ్మం-సూర్యాపేట-హైదరాబాద్ మార్గాలకు మళ్లించనుంది.
భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు
గద్దెల వద్ద భక్తులకు క్యూలైన్లో అసౌకర్యం కలుగకుండా అధికారులు చలువ పందిళ్లు, తాగునీరు, వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వైద్య సిబ్బంది గతంలో కంటే రెండింతలు పెంచనున్నారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి, పాజిటివ్ తేలితే వెంటనే వారికి చికిత్స చేసేందుకు ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మాసులు, శానిటైజర్లు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నారు.
8 జోన్లు, పలు సెక్టార్లుగా విభజన
అధికారుల మధ్య సమన్వయం చేసి బాధ్యతగా విధులు నిర్వర్తించేందుకు మేడారాన్ని 8 జోన్లు, పలు సెక్టార్లుగా విభజించారు. ఇందుకు మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు. మేడారం వచ్చే భక్తుల భద్రత, దొంగతనాల నివారణ చర్యల కోసం భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతర నిఘాతోపాటు షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు విధుల్లో నియమిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సాంకతిక పరిజ్ఞానం వినియోగం
పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, మేడారం జాతర మార్గాలు, భక్తుల వసతులు, సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా, యాప్స్తో సేవలు అందించనున్నారు. పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రతి గంటకోసారి పర్యవేక్షించేలా భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించనున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..
మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నాం. పకా ప్రణాళికతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు సమీక్ష చేశాం. ఇటీవలే ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, ముఖ్య ప్రజాప్రతినిధులు కలిసి వసతుల కల్పన, కరోనా జాగ్రత్తలు, జాతరను విజయవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించాం. ఈ మేరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంత పెద్ద జాతరలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలతోపాటు భక్తులు కూడా సహకరించాలి. మాసులు ధరించి, నిబంధనల మేరకు అమ్మవార్లను దర్శించుకోవాలి. ఎలాంటి ఇబ్బందులున్నా అకడున్న అత్యవసర నంబర్లు, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సాయం పొందాలి.
– గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్