ములుగు, మే 17 (నమస్తేతెలంగాణ): ‘వరికొయ్యలో పోషకాలు అధికంగా ఉంటా యి. వరి కోతల తర్వాత కొయ్యలు కాల్చడంతో భూసారం తగ్గడంతో పాటు దిగుబడిపై ప్రభావం చూపుతుంది’ అవసరమైతే వాటిని భూమిలో కలియదున్నాలి’ ఇది ఏటా సాగు వాటుకు ముందు వ్యవసాయ అధికారులు రైతులకు చెబుతున్న మాట. అయినా, రైతులు మాత్రం అవేవి పట్టించుకోకుండా వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. దీంతో అక్కడక్కడ అగ్ని ప్రమా దాలు జరిగి అడవులు తగులబడిపోతున్నాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురియడంతో పాటు రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులు సత్ఫలితాలనిస్తు న్నాయి. దీనికి తోడు కోతలు లేని విద్యుత్ సరఫరాతో రైతన్నలు సిరులు కురిపించే పంటలు సాగు చేస్తున్నారు. వరికోత తర్వాత గడ్డి పొలాల్లోనే మిగులుతోంది. దీనిని ఇతర ప్రాంతాలకు తరలించలేని రైతులు పొలాల్లోనే కొయ్యకాలుతో పాటు కాల్చేస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో అగ్ని ప్రమాదాలు కూడా సంభవించడం గతంలో జరిగిన కొన్ని సంఘటనలు నిదర్శనంగానిలుస్తున్నాయి.
నిప్పు పెడితే నష్టాలు
వరి కొయ్యలను కాల్చితే వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు వేడితో భూమి సారం కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ వంటి పోషక పదార్థాల శాతం, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఖనిజ లవణాలు దెబ్బతిని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయి. పంట రక్షకులైన వానపాములు, ముంగీసలు, ఉడుములు, తొండలు చనిపోతాయి.
మల్చర్ విధానంతో మేలు
మల్చర్ విధానంలో కొయ్యకాళ్లను తొలగించే విధానా న్ని పాటించాలి. గడ్డికప్పు యంత్రంతో కొయ్యకాళ్ల గడ్డిని కత్తిరించి నేలపై సమాంతరంగా పర్చి నీటి తడి పెట్టాలి. పది రోజుల పాటు మురగనివ్వాలి. ఆ తర్వాత ట్రాక్టర్తో దున్నితే నేలలో కలిసిపోతుంది. దీంతో నేల సారవంతమవుతుంది. దుక్కి దున్నే సమయంలో సూపర్ పాస్పేట్ చల్లితే రెండు వారాల్లో అవశేషాలు మురిగి పోషకాలుగా మారుతాయి. రెండు శాతం నత్రజని, 4 శాతం పాస్పరస్ అదనంగా లభిస్తుంది.
దిగుబడిపై ప్రభావం చూపుతుంది
కొయ్యకాళ్లను తగులబెడితే భూసారంతో పాటు దిగుబడిపై ప్రభావం ఏర్పడుతుంది. మట్టిలో పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు చనిపోయే అవకాశం ఉంది. రోటోవేటర్తో మల్చర్ విధానంలో కొయ్య కాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి సూపర్ ఎరువు వేసి దున్నితే భూమి సారవంతమవడంతో పాటు అధిక దిగుబడి వస్తుంది.
– కేఏ గౌస్హైదర్ , డీఏవో