వెంకటాపూర్, ఏప్రిల్ 30: కాకతీయుల కాలంలో పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందనేందుకు అనేక ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. శత్రువుల రాకపోకలను గుర్తించేందుకు గుట్టలు, కొండలపై నిర్మించిన అనేక సైనిక స్థావరాలు కొన్నిచోట్ల చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటిలో ఒకటి రామప్ప చెరువు వద్ద ఉన్న వరాల గుట్ట కాగా, ఇక్కడికి రహదారి సౌకర్యం కల్పిస్తే ఈ అందమైన ప్రదేశం మరో పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది.
ములుగు జిల్లా వెంటాపూర్ మండలంలోని పాలంపేట రామప్ప ఆలయానికి ఆగ్నేయ దిశలో వరాల గుట్ట ఉన్నది. ఇది కాకతీయుల కాలంలో సెక్యూరిటీ వ్యూ పాయింట్ అని స్థానికులు చెబుతుంటారు. గుట్ట శిఖరాన చుట్టూరా దాదాపు కిలో మీటర్ మేర రాళ్లతో గోడ నిర్మించారు. శత్రువుల రాక పోకలను ఎప్పటికప్పుడు గుర్తించి రాజుకు సమాచారం చేరవేసేవారు. మంటలు, పొగల సంకేతాలను ఇచ్చిపుచ్చుకొనేవారు. ఇక్కడ సుమారు 20 గుంటల మేర మైదానం ఉన్నది. సైనికుల పర్యవేక్షణ కోసం చిన్నపాటి రాళ్లతో కట్టిన గోడ ఉంది. దాహం తీర్చుకునేందుకు కట్టిన కొలను కూడా ఉంది. గోడ నిర్మాణం కోసం గుట్టను తొలిచిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ గుట్ట శిఖరం నుంచి చూస్తే ములుగు, భూపాలపల్లి, గణపురం, వెంకటాపూర్ పట్టణాలు, ఆయా మండలాలకు చెందిన గ్రామాలు కనిపిస్తాయి. దాదాపు చుట్టూ 20 కిలో మీటర్ల మేర ఉన్న ప్రాంతాలను చూడవచ్చు.
మక్కకంకులకు వరహాలు!
ఇక్కడి గుట్టకు వరాల గుట్ట (వరహాల గుట్ట) అని పేరు రావడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. రామప్ప శిఖం భూముల్లో కరువు తాండవిస్తున్న సమయంలో ఓ రైతు మక్క పంట వేశాడు. బెరడుకు గింజల బదులు వరహాలు (బంగారు నాణేలు) కాశాయని, వాటిని ఎవరూ ఎత్తుకెళ్లకుండా ఆ రైతు గుట్ట పైకి పంటను తరలించి అక్కడే నూర్పిడి చేసేందుకు కల్లం ఏర్పాటు చేశాడని, ఆ తర్వాత వరహాలను ప్రజలందరికీ పంచి పెట్టాడని, అలా దానం పొందిన ఓ స్త్రీ రామాంజపూర్లో ఎరుకలనాంచారి (పంచకూటాలయం) ఆలయం నిర్మించిందనే కథనం ప్రచారంలో ఉంది. ఆ తర్వాత కూడా ఈ ప్రాంతంలో కొందరికి బంగారు నాణేలు, నిధులు దొరికాయని స్థానికులు చెబుతున్నారు.
ఎలా వెళ్లాలి..!
వరాల గుట్టకు చేరుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. రామప్ప చెరువు వద్దకు వెళ్లి అక్కడి నుంచి బోటు ద్వారా గుట్ట వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి దాదాపు కిలోమీటరు దూరం నడక ద్వారా పైకి ఎక్కాలి. వెంకటాపూర్-పాలంపేట రహదారి మధ్యలో కొంత దూరం నడిచి వెళ్లి అక్కడి నుంచి గుట్ట పైకి చేరుకోవచ్చు. బరిగలానిపల్లి గ్రామం నుంచి గుట్టపైకి మరో మార్గం ఉంది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో గుట్ట వద్దకు రహదారి నిర్మించి, గుట్టపైకి మెట్లు వేస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు కోరుతున్నారు. పాండవుల గుట్టలానే ట్రెక్కింగ్కు కూడా అనుకూలంగా ఉంటుంది.