ములుగు టౌన్/వాజేడు, ఫిబ్రవరి 19 : ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయ సమీపంలోని ములుపు వద్ద 163వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మహిళకు తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై ఓంకార్ యాదవ్ కథనం ప్రకారం… ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీను, రమేశ్ అన్న కుమారుడి పెండ్లిచూపులకు కుటుంబసభ్యులతో కలిసి నర్సంపేటకు కారులో బయల్దేరారు. ఈక్రమంలో ములుగు సమీపంలోని గట్టమ్మ దేవాల య సమీపంలో ఉన్న మూలపులుపు వద్దకు చేరుకోగానే హన్మకొండ నుంచి మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ చంద్రుపట్ల గ్రామానికి చెందిన బుద్దె కల్యాణ్(26), ధర్మవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెంది న కంభంపాటి శ్రీను(45), కంభంపాటి రమేశ్(48), ఆయన భార్య కంభంపాటి జ్యోతి(42) ఘటనా స్థలిలోనే మృతిచెందారు. శ్రీను భార్య సుజాత తీవ్రగాయాలతో వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీయించారు. పోస్ట్మార్టం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, వెంకటేశ్వర్లు, శ్రీను, రమేశ్ అన్నదమ్ము లు. అన్న వెంటేశ్వర్లుకు కొడుకు ఉన్నాడు. అతడి చిన్న వయసులోనే వెంకటేశ్వర్లు మృతిచెందగా, ఇద్దరు బాబాయిలే పెంచి పెద్ద చేశారు. అతడి పెండ్లి చూపులకోసమే వెళ్తూ మృత్యువాత పడ్డారు. దీంతో ధర్మవరం, చంద్రుపట్ల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు శ్రీనుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.