తాడ్వాయి, ఫిబ్రవరి 13 : మేడారం సమ్మక్క – సారల మ్మ మహాజాతరను కుటుంబ పండుగగా భావించి వైద్యసేవ లు అందించాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు అన్నారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం మహాజాతరలో భాగంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. గత జాతరలో భక్తులకు అందించిన వైద్యసేవలపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందికి నాణ్యమైన భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ములుగు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్యను ఆ దేశించారు. భక్తులకు ఎక్కువగా సోకే వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, గత జాతరలో కంటే మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మహాజాతరలో వైద్యసేవలు అందించేందుకు చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆరుగురు డీఎంహెచ్వోలు, 125మంది వైద్యాధికారులు, 600మంది పారామెడికల్ సిబ్బంది, 200మంది సహాయ సిబ్బంది ఉంటారని అప్పయ్య తెలిపారు.
వ్యాధులు కలిగించే అంశాలపై దృష్టిసారించాలి..
మహాజాతరకు కోటి మందికి పైగా భక్తుల రాకతో ఆహారం, నీళ్లు కలుషితమై వచ్చే వ్యాధులను నివారించేందుకు చర్యలు చేపట్టాలని డీహెచ్ చెప్పారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య శాఖలకు పలు సూచనలు చేయాలన్నారు. జాతరలో సరఫరా చేసే తాగునీటి షాంపిల్స్ను సేకరించిన పరీక్షలు నిర్వహించాలని, క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించాలన్నారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతరలో వ్యాపారులు కలుషిత ఆహారాన్ని విక్రయిస్తారని, దీని వల్ల పలు వ్యాధులు ప్రబలే ప్రమా దం ఉందన్నారు. ఈవిషయమై ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడుతానని, జాతరలో దాడులు నిర్వహించి కలుషిత ఆహారం, నీళ్లు విక్రయించకుండా చర్యలు చేపడుతామని తెలిపారు. జాతర జరిగే నాలుగు రోజలు పాటు స్వచ్ఛమైన నీటితోపాటు కలుషితం కాని ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించేలా చర్యలు చేపడుతామని వివరించారు. జాతరలో ప్రధాన భూమిక పోషించే గ్రామీణ నీటిపారుదల, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు.
24గంటలు వైద్యసేవలు..
మహాజాతర సమయంలో మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంతోపాటు జాతర పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్యశిబిరాల్లో 24 గంటలపాటు వైద్యసేవలు అందిస్తారని డీహెచ్ తెలిపారు. నాలుగు రోజులపాటు వైద్యశిబిరాల్లో అస్వస్థతకు గురైన భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని, అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎలాంటి వ్యాధులకైనా సత్వర చికిత్స అందించేందుకు పలురకాల ఏర్పాట్లు చేపట్టామని అన్నారు.