ప్రకృతి వనం.. ఊరికి అందం
అందుబాటులోకి వైకుంఠధామం
ప్రతి రోజూ చెత్త సేకరణతో వీధులు శుభ్రం
ఊరిలో ఎటు చూసినా పచ్చదనం
అధికారులు, పాలకుల సమన్వయంఅద్దంలా రోడ్లు
పక్కా ప్రణాళికతో మౌలిక వసతులు
మహబూబాబాద్ రూరల్, మే 19: పల్లె ప్రగతి నిధులతో జంగిలికొండ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్లు దూరంలో ఉన్నా ప్రగతిలో పరుగులు పెడుతున్నది. ఇక్కడి విలేజ్ పార్క్ ఊరికే అందం తెచ్చింది. వైకుంఠధామం, సెగ్రిగేషన్ పూర్తయి గ్రామస్తులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రోజూ చెత్తను సేకరిస్తుండడంతో వీధులు, శుభ్రంగా మారాయి. రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. పాలకవర్గం, అధికారుల సమన్వయంతో గ్రామం మౌలిక వసతులను సమకూర్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నది.
మహబూబాబాద్ మండల పరిధిలోని జంగిలికొండలో 1450 మంది జనాభా, 860 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రతి నెలా రూ. లక్షా 60 వేలను జీపీ ఖాతాలో జమ చేస్తున్నది. ఈ నిధులను సర్పంచ్, పాలకవర్గం ప్రణాళికాబద్ధంగా కేటాయిస్తుండడంతో గ్రామం ప్రగతిపథంలోకి దూసుకుపోతున్నది.
అందంగా పల్లె ప్రకృతి వనం
ప్రభుత్వం అందించిన నిధులతో పల్లె ప్రకృతి వనానికి రూ. 5.80 లక్షలు కేటాయించారు. పలు రకాల పండ్లు, పూల మొక్కలు నాటి, ప్రతి రోజూ వాటికి నీరు పోసి సంరక్షిస్తున్నారు. ఎటు చూసినా పచ్చందాలతో విలేజ్ పార్క్ గ్రామస్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది.
వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్ కూడా..
ఊరి చివరన రూ. 12.40 లక్షలతో అన్ని వసతులతో వైకుంఠధామాన్ని నిర్మించారు. డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు వేదిక భవనాన్నీ నిర్మించారు. గ్రామంలోని దాతలు, పాలకవర్గం సహకారంతో రూ. 5 లక్షలతో రెండు కాలనీలకు సీసీ రోడ్లు వేశారు.
రోజూ చెత్త సేకరణ
రూ. 8.90 లక్షల జీపీ నిధులతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. వీటితో ప్రతి రోజూ ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. ఇంటి ముందు చెత్త వేసిన వారికి రూ. 500 జరిమానా విధిస్తామని బోర్డ్లను సిద్ధం చేయడంతో ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. సిబ్బంది ప్రతి కాలనీలో రోడ్లను ఊడుస్తూ, డ్రైనేజీల్లోని చెత్తను తీస్తూ తరలిస్తున్నారు.