ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
ములుగురూరల్, మే 18 : కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని మల్లంపల్లి గ్రామంలో సర్పంచ్ చంద కుమారస్వామితో కలిసి ఆశవర్కర్లు, పారిశుధ్య కార్మికులను ఆయన సత్కరించి నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే లాక్డౌన్ విధించిందని, నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మాస్కులను విధిగా ధరించి చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రజలు గుంపులుగా ఉండకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, సీనియర్ నాయకులు గోవింద్నాయక్, తా హిర్పాషా, మురళీధర్రావు, చిట్టిరెడ్డి మ ల్లారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
భాగస్వాములు కావాలి..
కృష్ణకాలనీ : కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని 15వ వార్డు కౌన్సిలర్ నాగవెల్లి సరళ అన్నారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కాకతీయ కాలనీలో కౌన్సిలర్ సోడియం హైపోక్లోరైట్ ద్రావ ణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు కరో నా నియంత్రణ చర్యల్లో భాగంగా రసాయనాలు పిచికారీ చేయిస్తున్నామన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావొద్దని, ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు.
కమలాపురంలో..
మంగపేట : మండలంలోని కమలాపురంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అధికారులు పిచికారీ చేయించారు. పలు వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చందూలాల్, ప్రత్యేకాధికారి శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.