ములుగు : రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ మేడారంలో పర్యటించారు. ఈసందర్భంగా..పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉత్సాహంగా మంత్రి మేడారంలో గడిపారు. అలాగే.. చెత్త వేసిన ఇద్దరు దుకాణదారులకు జరిమానా విధించారు. ఒకరికి రూ.5వేలు, మరొకరికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. పారిశుద్ధ్యం విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు.
మేడారం జాతర పనులు పర్యవేక్షించడానికి వచ్చిన మంత్రి ముందుగా అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి గద్దెల వద్ద, చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీ చేశారు. గద్దెల వద్ద చెత్తా చెదారం పడి ఉండటాన్ని గమనించారు. భక్తులు తాము ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకునే పసుపు కుంకుమలు, బంగారం (బెల్లం) సంచులను అక్కడే పడేసి వెళ్లడాన్ని గమనించారు.
ఆ చెత్త అలాగే ఉండటాన్ని చూసి అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది, వాలంటీర్లును పిలిచి మాట్లాడారు. అలాంటి చెత్తను వెంట వెంట తీసేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కనీసం ప్రతి గంటకు ఒకసారి చొప్పున చెత్తను తొలగించాలని ఆదేశించారు. అలాగే గద్దెల అవరణలోనూ మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు కూడా చెత్త వేయకూడదని మైకుల్లో చెప్పాలని సూచించారు. ఆ తర్వాత టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కలిసి తాత్కాలిక బస్స్టేషన్ను ప్రారంభించారు.