తాడ్వాయి, జనవరి 30: వరాలిచ్చే దేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర సమీపిస్తుండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి క్యూ కడుతున్నారు. ఆదివారం సుమారు ఐదు లక్షల పైచిలుకు భక్తులు అమ్మ వార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. భక్తులు, వారి వాహనాలతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల దర్శనం అనంతరం యాటపోతులు, కోళ్లు సమర్పించి గద్దెల పరిసరాలతోపాటు చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో విడిది చేసి వంటలు వండుకుని విందు భోజనాలు చేశారు. రద్దీ ఎక్కువ కావడంతో బయటి నుంచే అమ్మవార్లను దర్శించుకునేలా పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఎత్తుబెల్లాన్ని నేరుగా గద్దెలపైకి వేస్తున్నారు. ప్రసాదం తీసుకోవడానికి మాత్రం అక్కడ విధుల్లో ఉన్న వారిని అడిగినా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో జంట వంతెనల నుంచి నార్లాపురం వరకు వేలాది వాహనాలు నిలిచిపోయా యి. రెండు గంటల అనంతరం పోలీసులు వాగు అవతల వైపునకు వచ్చి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కొత్తూరు వద్ద గల రోడ్డు, కొంగలమడుగు, ఆర్టీసీ బస్టాండ్, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి వాహనాలను పంపిస్తే ట్రాఫిక్ జామ్ సమస్యలను అధిగమించవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.