ములుగు : సమ్మక్క – సారలమ్మ యుద్ధ పోరాటం, తల్లుల చరిత్ర వెయ్యేళ్లు గుర్తుండిపోయేలా శిలాశాసనం ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Sitakka) వెల్లడించారు. మంగళవారం మేడారం లోని మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆసియా లోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ (Sammakka-Saralamma) జాతరను జాతీయ పండుగ(National Festival) గా గుర్తించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. జాతర అనంతరం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మినీ జాతర కల్లా మేడారం(Medaram) అభివృద్ధి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 60 లక్షల మంది భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకున్నారని, కోటి దాటే అవకాశం ఉందని వివరించారు.
జాతర నిర్వహణకు భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి రూ. 110 కోట్లను కేటాయించారన్నారు. హన్మకొండ నుంచి పస్రా, తాడ్వాయి నుంచి మేడారం వరకు 4 లైన్ల రోడ్లు వెడల్పు చేశామని తెలిపారు. జాతరలో 16,000 వేల మంది కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నట్లు వివరించారు. 12వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు.
రేపు వనం నుంచి గద్దె పైకి ..
ఈ నెల 21న సాయంత్రం కన్నేపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు గద్దెల పైకి చేరుకుంటారని మంత్రి తెలిపారు. 22న చిలకులగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఎస్పీ గౌరవ వందనం తో గాలిలో తుపాకీ పేల్చి , పూజారులు గిరిజన సాంప్రదాయాలతో గద్దె పైకి తీసుకొస్తారని అన్నారు. 23న అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరుతారని, ఆ రోజు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 24న తిరిగి అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఎండోమెంట్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.