ఏటూరునాగారం, ఫిబ్రవరి 21 : మహాజాతరలో భాగంగా మేడారానికి కొండాయి నుంచి గోవిందరాజులు బుధవారం బయల్దేరి రాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. కొండాయిలోని గోవిందరాజుల గుడిలో పూజారి దబ్బగట్ట గోవర్దన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గుడిలో జలం చల్లి శుద్ధి చేశారు. కొండాయిలోని ప్రజలంతా మధ్యాహ్నం మూడు గంటలకు గుడికి చేరుకున్నారు. పక్కనే నాగులమ్మ ఆలయంలో పూజలు చేశారు.
గోవిందరాజు పడిగతో గుడి నుంచి డోలు వాయిద్యాల నడుమ వడ్డె పొదెం బాబు జనసందోహం నడుమ బయల్దేరారు. తమకు ముక్తి ప్రసాదించాలని భక్తులు పడుకుని స్వాగతించారు. మహిళలు నీటిని ఆరబోశారు. కొండాయి నుంచి కొత్తూరు సమీపంలోని అటవీ మార్గాన ఊరట్టం మీదుగా మేడారానికి కాలినడకన గ్రామస్తులతో కలిసి బయల్దేరారు. మేడారంలోని సమ్మక్క గుడికి వెళ్లి అక్కడినుంచి గద్దెపై ప్రతిష్టింపజేశారు.