Medaram Jathara | ఏటూరునాగారం/వాజేడు/ములుగు రూరల్, ఫిబ్రవరి 21: మేడారం మహాజాతర ప్రారంభం రోజే భక్తులు నీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. చేతిపంపుల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో అక్కడక్కడ కొట్లాటలు జరిగాయి. ఛత్తీస్గఢ్, భద్రాచలం, కొత్తగూడెం, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు ఊరట్టం వైపు గుడారాలు వేసుకొని విడిది చేయగా, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిలుకల గట్ట వైపు కూడా నీటి సరఫరా సక్రమంగా లేక చేతిపంపుల వద్ద కుస్తీ పడుతున్నారు. నీటి ట్యాంకర్ల వెంట పరుగులు తీస్తున్నారు.
రెడ్డిగూడెంలో గద్దెలకు సమీపంలో బోరింగులు ఎక్కువగా లేవు. ఉన్న ఒక్క బోరింగు వద్ద బకెట్లను వరుసగా పెట్టి గంటల తరబడి వేచి ఉంటూ అవస్థలు పడ్డారు. తాగునీటి సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నా సరైన సరఫరా లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, పిల్లలతో వచ్చాం ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.