వేలేరు : మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సీఐ పూర్ణేశ్వర్ సూచించారు. వేలేరు ఎస్ఐ అజ్మీర సురేశ్ ఆధ్వర్యంలో మంగళవారం మనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంతో పాటు, పీచర, మల్లికుదుర్ల, షోడశపల్లి గ్రామాల్లో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ పూర్ణేశ్వర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు.
డ్రగ్స్ విక్రయం, వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలు లాంటి మంచి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ సమస్యను అరికట్టడం, యువతలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.